తటస్థ వేదికల్లో టీమిండియాకు అచ్చొచ్చిన స్టేడియం షార్జా. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలకు షార్జా క్రికెట్ గ్రౌండ్లో తమ పేరిట ఎన్నో రికార్డులు సృష్టించారు
తటస్థ వేదికల్లో టీమిండియాకు అచ్చొచ్చిన స్టేడియం షార్జా. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలకు షార్జా క్రికెట్ గ్రౌండ్లో తమ పేరిట ఎన్నో రికార్డులు సృష్టించారు.
తాజాగా ఈ ఏడాది ఐపీఎల్ 2020 నేపథ్యంలో సచిన్ షార్జాలో భారత్ సాధించిన విజయాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. వీటిలో ప్రముఖమైనది 1998 కోకాకోలా కప్. జింబాబ్వేతో జరిగిన ఫైనల్లో దాదా చెలరేగిపోయాడు.
గ్రాంట్ ఫ్లవర్ వేసిన ఒకే ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టి బంతిని స్టేడియం దాటించాడు. గంగూలీ వీర విహారంతో భారత్ 197 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఛేదించింది. కాగా ఐపీఎల్ 2020లో భాగంగా మంగళవారం షార్జాలో జరిగిన నెట్ సెషన్లో ఎడమ చేతి బ్యాట్స్మన్ రిషబ్ పంత్ భారీ సిక్సర్లు కొట్టి గంగూలీని గుర్తుకు తెచ్చాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ ట్వీట్టర్లో పోస్ట్ చేసింది. ఐపీఎల్లో పంత్ను ఆపాలంటే బౌలర్లు ఎంతో కృషి చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ వ్యాఖ్యానించింది. కాగా రిషబ్ పంత్కు ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ తన పేలవమైన ప్రదర్శన కారణంగా జాతీయ జట్టులో స్థానం కోల్పోయాడు.
ఈ క్రమంలో తనను తాను నిరూపించుకోవడానికి ఐపీఎల్ 2020ని వేదికగా చేసుకున్నాడు. ఐపీఎల్ మునుపటి సీజన్లో ఈ ఎడమ చేతి వాటం బ్యాట్స్మన్ తాను సిక్స్లు ఎలా కొడతానో చూపించాడు.
ఈ ఏడాది దానిని మరో మెట్టు పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. మునుపటి రెండు సీజన్లలో పంత్ మంచి ప్రదర్శన ఇచ్చాడు. గత సీజన్లో అతను 16 మ్యాచ్ల్లో 37.53 సగటుతో 488 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 162.66.
అంతకుముందు ఏడాది 52.61 సగటుతో 684 పరుగులు చేశాడు. ఆ సమయంలో స్ట్రైక్ రేట్ 173.60. ఐపీఎల్ 2020 రెండవ రోజు (సెప్టెంబర్ 20, ఆదివారం) దుబాయ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో ఢిల్లీ తలపడనుంది.
