Asianet News TeluguAsianet News Telugu

క్రీజులో నిలబడిన అశ్విన్ - కుల్దీప్...  తొలి టెస్టులో భారీ స్కోరు దిశగా టీమిండియా...

రెండో రోజు లంచ్ బ్రేక్ విరామ సమయానికి 7 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసిన టీమిండియా... 40 పరుగులతో క్రీజులో రవిచంద్రన్ అశ్విన్.. 

Ravichandran Ashwin, Kuldeep Yadav batting, Team India heading towards huge total
Author
First Published Dec 15, 2022, 11:28 AM IST

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్‌ బ్యాటుతో రాణించడంతో భారత జట్టు భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది భారత జట్టు. ఓవర్‌నైట్ స్కోరు 278/6 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, మొదటి సెషన్‌లో అయ్యర్ వికెట్ కోల్పోయి 70 పరుగులు చేసింది...

రెండో రోజు ఓవర్‌నైట్‌ స్కోరుకి  15 పరుగులు జోడించిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ వికెట్ కోల్పోయింది భారత జట్టు. 192 బంతుల్లో 10 ఫోర్లతో 86 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, ఎబదత్ హుస్సేన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు... రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ కలిసి 8వ వికెట్‌కి 55 పరుగులు జోడించారు. అశ్విన్ 81 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేయగా కుల్దీప్ యాదవ్ 76 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేశాడు. 

తొలి రోజు ఎబదత్ హుస్సేన్ బౌలింగ్‌లోనే శ్రేయాస్ అయ్యర్ క్లీన్ బౌల్డ్ అయినా బెయిల్స్ కిందపడకపోవడంతో నాటౌట్‌గా తేలాడు. నేటి ఉదయం ఎబదత్ హుస్సేన్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్‌ని లిటన్ దాస్ జారవిడిచాడు. దీంతో మూడు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న శ్రేయాస్ అయ్యర్, సెంచరీకి 14 పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. 

తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది టీమిండియా. 14 పరుగులు చేసిన అక్షర్ పటేల్, తొలి రోజు ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత జట్టుని రిషబ్ పంత్‌తో పాటు ఛతేశ్వర్ పూజారా, శ్రేయాస్ అయ్యర్ కలిసి ఆదుకున్నారు. రిషబ్ పంత్ 46 పరుగులు చేసి అవుట్ కాగా, ఛతేశ్వర్ పూజారా, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు... ఐదో వికెట్‌కి 149 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత పూజారా వికెట్ కోల్పోయింది టీమిండియా. 

తన స్టైల్‌లో 125 బంతుల్లో టెస్టుల్లో 34వ హాఫ్ సెంచరీ అందుకున్నాడు ఛతేశ్వర్ పూజారా. 203 బంతుల్లో 11 ఫోర్లతో 90 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా.. సెంచరీ చేరువులో అవుటై పెవిలియన్ చేరాడు.  అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకి శుభారంభం దక్కలేదు. 40 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో యాసిర్ ఆలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా. 54 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసిన కెప్టెన్ కెఎల్ రాహుల్, ఖలీద్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

ఆఖరి వన్డేలో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ... 5 బంతులాడి 1 పరుగుకే అవుట్ అయ్యాడు. తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు విరాట్. డీఆర్‌ఎస్ తీసుకున్నా ఉపయోగం లేకపోయింది. 

48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, 45 బంతుల్లో 6 ఫోర్లు,2 సిక్సర్లతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ కొట్టిన రిషబ్ పంత్, ఆ తర్వాతి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Follow Us:
Download App:
  • android
  • ios