నాలుగు వన్డేల్లో మూడింట్లో ఓడి, సిరీస్ కోల్పోయిన టీమిండియా... నాలుగో వన్డేలో 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం...జులన్ గోస్వామి లేకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకున్న భారత జట్టు...

సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా రెండు వన్డేలు ఓడిన టీమిండియా, సిరీస్‌ను చేజార్చుకుంది. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే మూడు విజయాలు అందుకున్న సఫారీ జట్టు, 3-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. స్మృతి మంధాన 10 పరుగులకే అవుటైనా ప్రియా పూనియా 32, మిథాలీరాజ్ 45 పరుగులు చేశారు. పూనమ్ రౌత్ 123 బంతుల్లో 10 ఫోర్లతో 104 పరుగులు చేసి, వన్డేల్లో మూడో సెంచరీ నమోదు చేసింది.

35 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 పరుగులు చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్, మెరుపు హాఫ్ సెంచరీ బాదింది. అయితే ఈ మ్యాచ్‌లో సీనియర్ పేసర్ జులన్ గోస్వామికి విశ్రాంతి ఇవ్వడంతో 267 లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి చేధించింది సౌతాఫ్రికా మహిళా జట్టు.

లిజెల్లీ లీ 69, లారా వోవార్ట్ 53, మెగ్నాన్ గు ప్రీజ్ 61 పరుగులు చేసి అవుట్ కాగా లారా గుడ్‌ఆల్ 59, మరిజాన్నే కాప్ 22 పరుగులతో రాణించి సఫారీ జట్టుకి విజయాన్ని అందించారు.