భారత జెండాపై పాక్ మాజీ క్రికెటర్ షాహిదీ ఆఫ్రిదీ ఆటోగ్రాఫ్... గౌరవించాడా? అవమానించాడా?...
లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఆసియా లయన్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ... జాతీయ జెండాపై ఆటోగ్రాఫ్ ఇవ్వడంపై టీమిండియా ఫ్యాన్స్ సీరియస్..
భారత్, పాక్ మధ్య దశాబ్దాలుగా ఉన్న వైరం గురించి అందరికీ తెలుసు. రాజకీయల్లో కాదు, క్రికెట్లోనూ ఇండియా, పాకిస్తాన్ తలబడితే హోరాహోరీ ఫైట్ సాగుతుంది. ఇండియా-పాక్ మ్యాచ్ జరుగుతుందంటే స్టేడియం ఫుల్ అయిపోతుంది. వేలు, లక్షల మంది ఇరుదేశాల మంది జనాలు, ఒకేచోట చేరుతుండడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది...
కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇండియా - పాకిస్తాన్ మ్యాచులు చూసే అవకాశం దొరుకుతోంది. ఆసియా కప్ 2023 టోర్నీ వేదిక విషయంలో చాలా రోజులుగా చర్చ జరుగుతోంది...
ఇవన్నీ పక్కనబెడితే లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, ఆసియా లయన్స్ టీమ్ తరుపున ఆడుతున్నారు. ఈ టీమ్కి కెప్టెన్గా వ్యవహరిస్తున్న షాహిద్ ఆఫ్రిదీ చేసిన ఓ పని, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది...
ఓ భారత అభిమాని, తన దగ్గరున్న జాతీయ జెండాపై ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సిందిగా పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీని కోరాడు. దానికి ఆఫ్రిదీ ఏ మాత్రం ఆలోచించకుండ సంతకం చేసేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
‘బిగ్ మ్యాన్ విత్ బిగ్ హార్ట్..’ (పెద్ద మనసున్న పెద్ద వ్యక్తి) అని పాకిస్తాన్ క్రికెట్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. పొరుగుదేశాల జాతీయ జెండాని కూడా గౌరవించడం తెలిసిన షాహిద్ ఆఫ్రిదీ, గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు, అంతకుమించి గొప్ప వ్యక్తి కూడా అని పాక్ మాజీ క్రికెటర్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్...
అయితే టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. భారత జాతీయ జెండాపై పాక్ క్రికెటర్ ఆటోగ్రాఫ్ ఇవ్వడం అంటే అది ఇండియాని అవమానించడమేనని, అలా ఆటోగ్రాఫ్ అడిగిన ఆ వ్యక్తిని ముందు శిక్షించాలని కామెంట్లు పెడుతున్నారు భారత నెటిజన్లు... మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ వంటి భారత క్రికెటర్లు ఎప్పుడూ భారత జాతీయ జెండాపై ఆటోగ్రాఫ్ ఇవ్వలేదు. జాతీయ జెండాపై సంతకం చేయమని కోరిన ఫ్యాన్స్ విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించారు..
ఇదిలా ఉండగా లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 టోర్నీలో ఆసియా లయన్స్ ఫైనల్కి దూసుకెళ్లింది. ఇండియా మహారాజాస్ జట్టుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 85 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది ఆసియా లయన్స్. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్, 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగుల భారీ స్కోరు చేసింది...
ఉపుల్ తరంగ 50 పరుగులు చేయగా తిలకరత్నే దిల్షాన్ 27, మహ్మద్ హఫీజ్ 38, అస్గన్ అఫ్ఘర్ 34, తిసారా పెరెరా 24 పరుగులు చేశాడు. లక్ష్యఛేదనలో ఇండియా మహారాజాస్ జట్టు 16.4 ఓవర్లలో 106 పరుగులకి ఆలౌట్ అయ్యింది...
రాబిన్ ఊతప్ప 15, గౌతమ్ గంభీర్ 17 బంతుల్లో 7 ఫోర్లతో 32 పరుగులు చేసి రాణించగా మహ్మద్ కైఫ్ 14, సురేష్ రైనా 18 పరుగులు చేశారు. యూసఫ్ పఠాన్ 9, ఇర్ఫాన్ పఠాన్ 3, మన్వీందర్ బిస్లా 8, అశోక్ దిండా 2, ఓజా 2 పరుగులు చేయగా స్టువర్ట్ బిన్నీ, ప్రవీణ్ తాంబే డకౌట్ అయ్యారు...