పాకిస్తాన్తో ఓడి బంగ్లాదేశ్పై నెగ్గిన కివీస్..
New Zealand vs Bangladesh: పాకిస్తాన్ తో ముగిసిన తొలి మ్యాచ్ లో ఓడిన న్యూజిలాండ్... నేడు బంగ్లాదేశ్ ను ఓడించి ఈ సిరీస్ లో మొదటి విజయాన్ని అందుకుంది
టీ20 ప్రపంచకప్ కు ముందు న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్ లో ఆతిథ్య జట్టు బోణీ కొట్టింది. నిన్న పాకిస్తాన్ తో ముగిసిన తొలి మ్యాచ్ లో ఓడిన ఆ జట్టు.. నేడు బంగ్లాదేశ్ ను ఓడించి ఈ సిరీస్ లో మొదటి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్వల్ప లక్ష్యాన్ని కివీస్.. 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కివీస్ గెలుపులో బౌలర్లు సమిష్టిగా రాణించగా.. బ్యాటింగ్ లో ఓపెనర్ డెవాన్ కాన్వే (51 బంతుల్లో 70 నాటౌట్, 7 ఫోర్లు, 1 సిక్సర్) రాణించి న్యూజిలాండ్ ను గెలిపించాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన బంగ్లాదేశ్ విఫలమైంది బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ షాంటో (33) మినహా మిగిలినవారంతా విఫలమయ్యారు. ఓపెనర్ మెహది హసన్ మిరాజ్ (5) తో పాటు లిటన్ దాస్ (15), అఫిఫ్ హోసేన్ (24), మొసద్దెక్ హోసెన్ (2), యాసిర్ అలీ (7), కెప్టెన్ షకిబ్ (7) తక్కవ స్కోర్లకే పరిమితమయ్యారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, బ్రాస్వెల్, ఇష్ సోధీ చెరో రెండు వికెట్లు తీశారు.
స్వల్ప లక్ష్యాన్ని కివీస్ 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (16) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరినా కెప్టెన్ కేన్ విలియమ్సన్ (30), గ్లెన్ ఫిలిప్స్ (9 బంతుల్లో 23, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి కాన్వే కివీస్ కు విజయాన్ని అందించాడు. మిడిల్ ఓవర్లలో కట్టడి చేసిన బంగ్లా బౌలర్లు.. కివీస్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు.
ఈ ముక్కోణపు సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య జరుగగా 21 పరుగుల తేడాతో పాక్ గెలిచింది. రెండో మ్యాచ్ న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో పాక్.. 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. బాబర్ ఆజమ్ (73) నాటౌట్ గా ఉండి పాక్ కు రెండో గెలుపును అందించాడు. ఈ టోర్నీలో తర్వాత మ్యాచ్.. అక్టోబర్ 11న న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య క్రిస్ట్చర్చ్ వేదికగా జరుగనుంది.