MI vs KXIP: మళ్లీ స్కోర్లు టై... ఒకే రోజు రెండో ‘సూపర్ ఓవర్’ మ్యాచ్...
మరోసారి హాఫ్ సెంచరీలతో ఒంటరి పోరాటం చేసిన కెఎల్ రాహుల్...
మళ్లీ ఫెయిల్ అయిన మ్యాక్స్వెల్... దీపక్ హూడా మెరుపులు...
బుమ్రాకి 3 వికెట్లు...2 వికెట్లు తీసిన రాహుల్ చాహార్...
IPL 2020: ఐపీఎల్ 2020 సీజన్లో ఒకే రోజు రెండు మ్యాచులు టైలుగా ముగిశాయి. 177 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులకే పరిమితమైంది. దీంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్కి దారి తీసింది.
178 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ ఇన్నింగ్స్లో మయాంక్ అగర్వాల్ 11 పరుగులు చేయగా, క్రిస్గేల్ 21 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 24 పరుగులు, నికోలస్ పూరన్ 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
గ్లెన్ మ్యాక్స్వెల్ డకౌట్ అయ్యి, మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేసిన కెఎల్ రాహుల్ 51 బంతుల్లో ఏడు ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
రాహుల్ అవుట్ అయిన సమయంలో పంజాబ్ విజయానికి 15 బంతుల్లో 24 పరుగులు కావాలి. దీపక్ హుడూ 16 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్ నాలుగు బంతుల్లో 4 పరుగులు కావాల్సిన దశలో మూడు పరుగులే రాబట్టి, చేజేతులా మ్యాచ్ను చేజార్చుకుంది పంజాబ్. ముంబై ఇండియన్స్ బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీయగా రాహుల్ చాహార్ రెండు వికెట్లు తీశాడు.