Lata Mangeshkar Passes Away: భారత సంగీత సామ్రాజ్ఞి లతా మంగేష్కర్  ఆదివారం కన్నుమూశారనే వార్త దేశాన్ని శోకసంద్రంలోని నెట్టింది. భారత  క్రికెటర్లతో ఆమెకు సత్సంబంధాలున్నాయి

భారత సంగీత సామ్రాజ్యాన్ని మకుటం లేని మహారాణిగా ఏలిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆదివారం కన్నుమూశారు. ఆమె మృతిపట్ల దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమెకు సంగీతంతో పాటు క్రికెట్ అంటే కూడా ఇష్టం. భారత క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లతో ఆమెకు మంచి అనుబంధం ఉంది. సచిన్ అయితే లతాజీని సొంత అమ్మగా భావిస్తాడు. గతంలో భారత దేశం మ్యాచులు ఆడుతున్న సమయంలో ఆమె చూడటానికి కూడా వెళ్లేవారు.

భారత క్రికెటర్లతో సత్సంబంధాలను నెలకొల్పిన ఆమె.. 1983లో ప్రపంచకప్ నెగ్గిన క్రికెటర్లకు సత్కారం చేయడానికి గాను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) దగ్గర డబ్బులు లేకుంటే నిధుల సేకరణకు కచేరి చేసిందనే విషయం చాలా మందికి తెలియదు. కచేరి చేసినందుకు గాను లతా జీ నయా పైసా తీసుకోలేదు. 

వివరాల్లోకి వెళ్తే.. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో ప్రపంచకప్ గెలిచిన క్రికెటర్లకు సత్కారం చేయడానికి బీసీసీఐ దగ్గర డబ్బులు లేవు. దీంతో బోర్డు లతా మంగేష్కర్ తో ఓ సంగీత కచేరి చేయించింది. దాని నుంచి వచ్చిన నిధులతో ప్రపంచకప్ జట్టు సభ్యులను సత్కరించారు. ఆ షో ద్వారా వచ్చిన డబ్బులతో ఒక్కొక్క ఆటగాడికి లక్ష రూపాయల నగదు సాయం చేసింది బీసీసీఐ.. 

నేనూహించలేదు : లతా మంగేష్కర్

ఇక 1983లో భారత జట్టు వరల్డ్ కప్ గెలుపు పై ఆమె మాటల్లోనే... ‘నేను లార్డ్స్ లో ఫైనల్ చూశాను. రెండు సార్లు ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ పై మనం గెలుస్తామని నేనైతే ఊహించలేదు. భారతీయురాలిగా చాలా గర్వపడ్డాను. ఇక ట్రోఫీ నెగ్గాక కపిల్ దేవ్ నాకు ఫోన్ చేశాడు. లండన్ లో ఉన్న టీమిండియాతో డిన్నర్ చేసేందుకు నాకు ఆహ్వానం పంపాడు. నేను అక్కడికి వెళ్లి జట్టును అభినందించాను. ఆ సమయంలో మన ఆటగాళ్ల కోసం నేను నాలుగు గంటల పాటు పాటలు కూడా పాడాను. నేను పాటలు పాడేప్పుడు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ నా పక్కనే నిల్చున్నారు..’ అని ఓ సందర్భంగా తెలిపారు. 

ఇప్పుడంటే ప్రపంచంలోనే ఆదాయంలో నెంబర్ వన్ బోర్డుగా ఉన్నది బీసీసీఐ. కానీ 1983లో నెలవారీ వేతనాలు చెల్లించేందుకు కూడా మనదగ్గర డబ్బుల్లేని పరిస్థితి. ఇదే విషయమై ప్రముఖ జర్నలిస్టు మకరంద్ వైంగాంకర్.. 1983 వరల్డ్ కప్ హీరోల వేతనాలకు సంబంధించిన కీలక పత్రాన్ని తన ట్విట్టర్ లో పంచుకున్నారు. దాని ప్రకారం కపిల్ సేనకు రోజుకు రూ. 200 అలవెన్సు, మ్యాచ్ ఫీజుగా రూ. 1,500 దక్కాయి. అంటే మూడు రోజులకు గాను భారత జట్టులోకి కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, మోహిందర్ అమర్నాథ్, కె.శ్రీకాంత్, రవిశాస్త్రి, సందీప్ పాటిల్, యశ్పాల్ శర్మ, కృతి ఆజాద్, రోజర్ బిన్ని, మదన్ లాల్, సయీద్ కిర్మాణీ, బి.సంధు, దిలీప్ వెంగ్సర్కార్, సునీల్ విల్సన్ లకు మూడు రోజులకు రూ. 2,100 (ఒక్కొక్కరికి) అందేవి.

అయితే ప్రపంచకప్ తో తిరిగివచ్చిన ఆటగాళ్ల కు నగదు బహుమతి అందిచేందుకు గాను బీసీసీఐ.. లతా మంగేష్కర్ తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది.