Asianet News TeluguAsianet News Telugu

ఐదేసిన కుల్దీప్ యాదవ్... బంగ్లాదేశ్ ఆలౌట్! టీమిండియాకి భారీ ఆధిక్యం...

తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకి ఆలౌట్ అయిన బంగ్లాదేశ్... టీమిండియాకి 254 పరుగుల భారీ ఆధిక్యం.. ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్... 

Kuldeep Yadav Picks 5 wickets, Team India gets huge lead in 1st Innings India vs Bangladesh
Author
First Published Dec 16, 2022, 9:55 AM IST

రాకరాక వచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకున్నాడు భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఐదు వికెట్లు తీసి... ఇండియా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ గడ్డల మీద ఈ ఘనత సాధించిన బౌలర్‌గా నిలిచాడు. కుల్దీప్ యాదవ్‌కి ఇది కెరీర్‌లో 8వ టెస్టు మాత్రమే కావడం మరో విశేషం.  

ఓవర్‌నైట్ స్కోరు 133/8 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన బంగ్లాదేశ్, 55.5 ఓవర్లలో 150 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టీమిండియాకి 254 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. బంగ్లాని ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా, టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపించింది... 

మూడో రోజు మెహిదీ హసన్ మిరాజ్‌తో 9వ వికెట్‌కి 42 పరుగులు జోడించిన ఎబదత్ హుస్సేన్, 37 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 82 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసి... అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

కుల్దీప్ యాదవ్‌కి ఐదు వికెట్లు దక్కగా మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్ చెరో వికెట్ తీశారు. బంగ్లా ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ నజ్ముల్ హుస్సేన్ షాంటోని అవుట్ చేసి, బంగ్లాకి ఊహించని షాక్ ఇచ్చాడు మహ్మద్ సిరాజ్. తొలి బంతికే కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు షాంటో...

ఆ తర్వాత 17 బంతుల్లో 4 పరుగులు చేసిన యాసిర్ ఆలీని ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్. 30 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేసి భారత బౌలర్లపై కౌంటర్‌ అటాక్ చేసిన లిటన్ దాస్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

45 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన మరో ఓపెనర్, తొలి టెస్టు ఆడుతున్న జాకీర్ హుస్సేన్ 45 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసి... సిరాజ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

25 బంతుల్లో 3 పరుగులు చేసిన కెప్టెన్ షకీబ్ అల్ హసన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 75 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది బంగ్లాదేశ్...

22 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసిన నురుల్ హసన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 58 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేసిన ముస్తాఫిజుర్ రహీంని పెవిలియన్ చేర్చిన కుల్దీప్ యాదవ్, తైజుల్ ఇస్లామ్‌ని డకౌట్ చేశాడు...


అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 404 పరుగులకి ఆలౌట్ అయ్యింది. శ్రేయాస్ అయ్యర్ 192 బంతుల్లో 10 ఫోర్లతో 86 పరుగులు చేసి అవుట్ కాగా ఛతేశ్వర్ పూజారా 203 బంతుల్లో 11 ఫోర్లతో 90 పరుగులు చేసి టీమిండియా తరుపున తొలి ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ అవుటైన తర్వాత కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ కలిసి 8వ వికెట్‌కి 92 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

113 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, టెస్టుల్లో 13వ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 114 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్, టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు...

అశ్విన్ భారీ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చి స్టంపౌట్ కాగా కుల్దీప్ యాదవ్‌ని తైజుల్ ఇస్లాం ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. వస్తూనే రెండు సిక్సర్లు బాదిన ఉమేశ్ యాదవ్ 10 బంతుల్లో 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మహ్మద్ సిరాజ్ ఓ ఫోర్ బాది, మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్‌కి తెరబడింది...

భారత ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ 4, కోహ్లీ 1 మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్లు చేయగా మాజీ కెప్టెన్ విరాట్ లోయెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు.  బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం, మెహిదీ హసన్ మిరాజ్ నాలుగేసి వికెట్లు తీయగా ఎబదత్ హుస్సేన్, ఖలీద్ అహ్మద్‌లకు చెరో వికెట్ దక్కింది...

Follow Us:
Download App:
  • android
  • ios