రెండో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో చిత్తుగా ఓడిన శ్రీలంక.. టెస్టు సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్... డబుల్ సెంచరీతో విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన కేన్ విలియంసన్.. 

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో టీమిండియా, ఆస్ట్రేలియాలతో పోటీ పడింది శ్రీలంక. ఇండోర్ టెస్టు గెలిచి ఆస్ట్రేలియా నేరుగా ఫైనల్‌కి అర్హత సాధించగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆధిక్యం చూపించి... టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్‌ని కంగారు పెట్టింది శ్రీలంక.

లంక పోరాటం కారణంగా తొలి టెస్టు ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మాత్రం లంక జట్టు అలాంటి పోరాటం చూపించలేకపోయింది. తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకున్న న్యూజిలాండ్, రెండో టెస్టులో పూర్తి డామినేషన్ చూపించి... ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది..

వెల్లింగ్టన్ టెస్టులో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 123 ఓవర్లు బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది...

టామ్ లాథమ్ 21 పరుగులు చేసి అవుట్ కాగా డివాన్ కాన్వే 108 బంతుల్లో 78 పరుగులు చేశాడు. కేన్ విలియంసన్, హెన్రీ నికోలస్ కలిసి మూడో వికెట్‌కి 370 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 296 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్సర్లతో 215 పరుగులు చేసిన కేన్ విలియంసన్, టెస్టు కెరీర్ చరిత్రలో 28వ సెంచరీ అందుకున్నాడు...

అహ్మదాబాద్ టెస్టులో విరాట్ కోహ్లీ 28వ సెంచరీ అందుకోగా శ్రీలంకతో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో 27వ టెస్టు సెంచరీని అందుకున్నాడు కేన్ విలియంసన్. రెండో టెస్టులో డబుల్ సెంచరీతో విరాట్ కోహ్లీ టెస్టు సెంచరీని రికార్డును సమం చేశాడు కేన్ విలియంసన్..

డార్ల్ మిచెల్ 17 పరుగులు చేసి అవుట్ కాగా హెన్రీ నికోలస్ 240 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌట్ అయ్యింది శ్రీలంక..

కెప్టెన్ దిముత్ కరుణరత్నే 188 బంతుల్లో 9 ఫోర్లతో 89 పరుగులు చేయగా దినేశ్ చండీమల్ 37, నిశాన్ మధుశ్క 19 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు. లంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్, ధనంజయ డి సిల్వ, రజిత, అసిత ఫెర్నాండో డకౌట్ అయ్యారు. 

ఫాలోఆన్ ఆడిన శ్రీలంక, 142 ఓవర్లలో 358 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఒషాడో ఫెర్నాండో 5 పరుగులు చేయగా దిముత్ కరుణరత్నే 51 పరుగులు, కుశాల్ మెండిస్ 50, దినేశ్ చంఢీమల్ 62 పరుగులు చేశారు. ధనంజయ డి సిల్వ 185 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 98 పరుగులు చేసి 2 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు...

డబుల్ సెంచరీ చేసిన హెన్రీ నికోలస్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ’ అందుకోగా, మాజీ కెప్టెన్ కేన్ విలియంసన్‌కి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది..