Jasprit Bumrah: ఆరు నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి గాయంతో త్వరలోనే జరుగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు కూడా దూరం కానున్నాడు.
టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయంపై బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో బుమ్రాను అక్టోబర్ వరకైనా సిద్ధం చేయాలని బోర్డు భావిస్తున్నది. ఇన్నాళ్లు దాచుకుంటూ వచ్చిన వెన్నునొప్పి గాయం ఇప్పుడు మరింత ఎక్కువవడంతో, అతడికి శస్త్రచికిత్స తప్పదని వైద్యులు సూచించిన నేపథ్యంలో బుమ్రా విషయంలో ఆగమేఘాల మీద స్పందిస్తున్నది. తాజా సమాచారం మేరకు బుమ్రాకు న్యూజిలాండ్ లో సర్జరీ చేయించనున్నారని తెలుస్తున్నది.
క్రిక్బజ్ లో వచ్చిన కథనం మేరకు.. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) వైద్యుల సలహ మేరకు బుమ్రాకు సర్జరీ చేయించేందుకు సిద్ధమైన బీసీసీఐ, అతడిని కివీస్ కు పంపనుంది. న్యూజిలాండ్ లో గతంలో ఆ జట్టు పేసర్ షేన్ బాండ్ (ప్రస్తుతం ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్) తో పాటు ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ లకు సర్జరీ నిర్వహించిన వైద్యులతో బుమ్రాకు ఆపరేషన్ చేయించనున్నారు.
న్యూజిలాండ్ లో క్రికెటర్లతో పాటు ఇతర క్రీడాకారులకు విజయవంతంగా సర్జరీలు నిర్వహించిన రొవన్ షౌటెన్.. బుమ్రాకు సర్జరీ నిర్వహించనున్నాడని సమాచారం. క్రిస్ట్చర్చ్ కు చెందిన ఈ సర్జన్ గతంలో షేన్ బాండ్, జోఫ్రా ఆర్చర్ లతో పాటు ఆసీస్ పేసర్స్ జేమ్స్ పాటిన్సన్, బెన్ డ్వార్షియస్ లకు సర్జరీలు చేశాడు. ఇప్పుడు బుమ్రాకు కూడా ఇతడే సర్జరీ చేయనున్నాడని సమాచారం.
ఇప్పటికిప్పుడు సర్జరీ నిర్వహించినా బుమ్రా కనీసం 20 నుంచి 24 వారాలు పూర్తి వారాలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ లో వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఆలోపు అతడిని సిద్ధం చేయడమే లక్ష్యంగా బీసీసీఐ పావులు కదుపుతున్నది. ఐపీఎల్ తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లకు దూరమయ్యే బుమ్రా.. సెప్టెంబర్ లో జరగాల్సి ఉన్న ఆసియా కప్ లో కూడా ఆడేది అనుమానమే.
