NZvsENG: న్యూజిలాండ్ - ఇంగ్లాండ్ మధ్య నేడు వెల్లింగ్టన్ వేదికగా ముగిసిన రెండో టెస్టు తీవ్ర ఉత్కంఠ మధ్య ముగిసింది. ఒక్క పరుగు తేడాతో కివీస్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి టెస్టు సిరీస్ ను 1-1తో డ్రా చేసింది.
న్యూజిలాండ్ పర్యటనలో ఇంగ్లాండ్ కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. తొలి టెస్టును అలవోకగా నెగ్గిన ఆ జట్టు రెండో టెస్టులో మాత్రం విజయం ముంగిట ఒక్క పరుగు తేడాతో ఓడింది. కివీస్ నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ 256 పరుగులకే పరిమితమైంది. అయితే మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో ఓడటంపై ఆ జట్టు సారథి బెన్ స్టోక్స్ మ్యాచ్ ముగిశాక ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓడిపోయినదానికంటే ఇటువంటి టెస్టులో భాగస్వామి అయినందుకు గర్వంగా ఉందని స్టోక్స్ చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ ముగిశాక బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. ‘మ్యాచ్ లో గెలిచేందుకు చివరిదాకా వచ్చి విజయం ముంగిట ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడం నిరాశపరిచింది. కానీ ఓడిపోయినదానికంటే ముఖ్యం ఈ మ్యాచ్ లో మేం చాలామంది క్రికెట్ ప్రేమికులను అలరించాం. స్టేడియంలో ఆ ఆనందాన్ని మేం కళ్లారా చూశాం. అది ఓటమిని మరిచిపోయేలా చేసింది..
ఓడిపోవడం నిరాశ కలిగించినా ఇటువంటి మ్యాచ్ లలో భాగమవడం గర్వాంగా ఉంది. ఈ మ్యాచ్ చివరి రోజు ఆఖరి గంట వరకూ వస్తుందని నేనైతే ఊహించలేదు. టెస్టు క్రికెట్ లో ఉండే మజానే ఇది. ఇది అద్భుతం. మాతో పాటే కివీస్ ఆటగాళ్ల భావోద్వేగాలు కూడా అత్యున్నత స్థితిలో ఉన్నాయి. మాతో పాటు వాళ్లు కూడా ఈ టెస్టులో భాగమైనందుకు గర్విస్తుంటారు.. ఇది పక్కా పైసా వసూల్ మ్యాచ్..’అని చెప్పాడు.
కాగా గతేడాది జో రూట్ నుంచి కెప్టెన్సీ అందుకున్నాక బెన్ రూట్.. 12 టెస్టులలో ఇంగ్లాండ్ కు సారథ్యం వహిస్తే అందులో ఏకంగా పది మ్యాచ్ లలో విజయాలు సాధించడం గమనార్హం. ఇదిలాఉండగా ఒక టెస్టులో టీమ్ ఫాలో ఆన్ ఆడుతూ గెలవడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో సారి మాత్రమే. గతంలో ఇంగ్లాండ్.. 1894, 1981 లలో ఇలాగే గెలిచింది. 2001లో భారత్.. ఆస్ట్రేలియాను ఇలాగే (ఈడెన్ గార్డెన్స్ లో) ఓడించింది. తాజాగా న్యూజిలాండ్ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేసింది.
నాలుగో ఇన్నింగ్స్ లో తాము 250 పరుగులను ఛేదిస్తున్నప్పుడు ఆందోళన ఏమీ చెందలేదని మ్యాచ్ ముగిశాక స్టోక్స్ అన్నాడు. ఈమ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటగాళ్లకు ఫుల్ క్రెడిట్ దక్కుతుందని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్ లో వైఫల్యం తర్వాత ఆ జట్టు పుంజుకున్న తీరు అద్భుతమని కొనియాడాడు. బౌలింగ్ లో కూడా క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆ జట్టు.. తమపై ఒత్తిడి పెంచిందని ఇంగ్లాండ్ సారథి చెప్పాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. వెల్లింగ్టన్ లో జరిగిన రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (186), జో రూట్ (153) లు రాణించారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కివీస్.. 209 పరుగులకే ఆలౌట్ అయింది. టిమ్ సౌథీ (73) ఒక్కడే మెరుగ్గా ఆడాడు. ఫాలో ఆన్ ఆడిన కివీస్.. రెండో ఇన్నింగ్స్ లో 483 పరుగులకు ఆలౌట్ అయింది. కేన్ విలియమ్సన్ (132) సెంచరీ చేయగా టామ్ బ్లండెల్ (90) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. ఆఖరి రోజు 258 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్.. 256 పరుగులకే ఆలౌట్ అయింది. జో రూట్ (95) రాణించినా మిగిలిన బ్యాటర్లు క్రీజులో నిలవకపోవడంతో ఇంగ్లాండ్ కు ఓటమి తప్పలేదు.
