IPL 2023: ఆదివారం   గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో  29 పరుగులు అవసరం కాగా  వరుసగా ఐదు సిక్సర్లు బాదిన కేకేఆర్ బ్యాటర్ రింకూ తో పాటు  అతడి ధాటికి బలైన బౌలర్ యశ్ దయాల్ గురించి కూడా నెటిజన్లు వెతుకుతున్నారు.

రింకూ సింగ్.. ఒక్క మ్యాచ్ తో ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ కేకేఆర్ హిట్టర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఐపీఎల్ అయిపోయాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో 29 పరుగులు అవసరం కాగా వరుసగా ఐదు సిక్సర్లు బాదిన రింకూ తో పాటు అతడి ధాటికి బలైన బౌలర్ యశ్ దయాల్ గురించి కూడా నెటిజన్లు వెతుకుతున్నారు. చివరి ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న దయాల్.. రింకూ బాదుడుకు బలయ్యాడు. కానీ ఈ ఇద్దరూ కలిసి ఆడేవారే.. 

ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న యశ్ దయాల్ కూడా ఉత్తరప్రదేశ్ వాసే. యూపీలోని అలహాబాద్ దయాల్ ఊరు. 1997లో జన్మించిన దయాల్.. చిన్నప్పట్నుంచే క్రికెట్ పై మక్కువ పెంచుకున్నాడు. దయాల్ తండ్రి చందర్‌పాల్ దయాల్ కూడా మాజీ క్రికెటరే.

యూపీ తరఫున ఆడిన చందర్‌పాల్ ఫాస్ట్ బౌలర్. 80వ దశకంలో ఆడిన ఆయన తన కొడుకును కూడా తన మాదిరిగానే బౌలర్ ను చేశాడు. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన దయాల్.. బౌలర్ గానే కెరీర్ ఆరంభించి అదే విభాగంలో కొనసాగుతున్నాడు.

Scroll to load tweet…

2018లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన దయాల్.. ఇప్పటివరకు యూపీ తరఫున 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు, 14 లిస్ట్ ఎ మ్యాచ్ లు, 33 టీ20లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 58 వికెట్లు తీసిన దయాల్.. లిస్ట్ ఎ క్రికెట్లో 23 వికెట్లు పడగొట్టాడు. టీ20లలో 29 వికెట్లు పడగొట్టాడు.

దేశవాళీలో అదరగొట్టిన దయాల్ ను గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ. 3.2 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. గత సీజన్ లో దయాల్.. 9 మ్యాచ్ లు ఆడి 11 వికెట్లు కూడా పడగొట్టాడు. ఐపీఎల్ - 2022లో కూడా నిలకడగా రాణించడంతో దయాల్ కు భారత జట్టు నుంచి కూడా పిలుపొచ్చింది. గతేడాది భారత జట్టు డిసెంబర్ లో బంగ్లాదేశ్ లో పర్యటించిన విషయం తెలిసిందే. వన్డే టీమ్ లో దయాల్ కూడా ఎంపికయ్యాడు. అయితే ఆడే అవకాశం రాలేదు.

Scroll to load tweet…

ఇక దేశవాళీ క్రికెట్ లో దయాల్ - రింకూలు ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతన్నవాళ్లే కావడం గమనార్హం. దయాల్ బలహీనతలు తెలిసిన రింకూ.. చివరి ఓవర్లో అతడిపై పిడుగులా పడ్డాడు. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత రింకూ తో పాటు కేకేఆర్ టీమ్ కూడా దయాల్ కు అండగా నిలవడం గమనార్హం.