IPL 2023: భారత  క్రికెట్ జట్టు తాజా మాజీ సారథులు  సౌరవ్ గంగూలీ,  రోహిత్ శర్మతో పాటు భావి సారథిగా భావిస్తున్న హార్ధిక్  పాండ్యాపై   ఓ సోషల్ యాక్టివిస్ట్ పిల్ దాఖలు చేశాడు.

టీమిండియా మాజీ సారథి, కొద్దిరోజుల క్రితం వరకూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి అధ్యక్షుడిగా వ్యవహరించిన సౌరవ్ గంగూలీతో పాటు ప్రస్తుతం భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్న రోహత్ శర్మ.. భావి భారత సారథిగా గుర్తింపుపొందుతున్న హార్ధిక్ పాండ్యాలపై బీహార్ లోని ముజఫర్‌పూర్ లో ఓ సామాజిక కార్యకర్త ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశాడు. గేమింగ్ యాప్ లను ఎంకరేజ్ చేస్తూ.. ఈ ముగ్గురు యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరిపించాడు. ముజఫర్‌పూర్ లోని జిల్లా న్యాయస్థానంలో వీరిపై పిల్ దాఖలు చేస్తూ సంచలన ఆరోపణలు చేశాడు. 

ముజఫర్‌పూర్ కు చెందిన సామాజిక కార్యకర్త తమన్నా హష్మీ కోర్టుకు దాఖలు చేసిన పిల్ లో.. గంగూలీ, రోహిత్, హార్ధిక్ పాండ్యా లు ఐపీఎల్ కు రిలేటెడ్ గా ఉన్న ఆన్ లైన్ గేమ్స్ కు ప్రచారకర్తలుగా ఉంటూ వాటిలో పాలుపంచుకునేవిధంగా యువతను ఉసిగొల్పుతున్నారని ఆరోపించాడు.

ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ లో చిక్కుకున్న యువత వాటికి బానిసలుగా మారుతున్నారని తద్వారా వారి జీవితాలు నాశనమయ్యే ప్రమాదం ఉందని పిటిషన్ లో పేర్కొన్నాడు. యువతను తప్పుదారి పట్టించేలా క్రికెటర్లు, సినీతారల యాడ్స్ ఉన్నాయని పిల్ లో పేర్కొన్నాడు. గంగూలీ, రోహిత్, పాండ్యాలతో పాటు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పేరును కూడా ఇందులో చేర్చాడు.

తన పిటిషన్ లో తమన్నా హష్మీ.. ‘క్రికెట్, సినిమా యాడ్స్ వివిధ గేమింగ్ షోలను ప్రోత్సహిస్తున్నాయి. వీటి ద్వారా ఐపీఎల్ లో టీమ్స్ ను తయారుచేయాలని యాడ్స్ రూపంలో ప్రచారం చేస్తున్నారు. వీటికి ఆకర్షితులైన యువత.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది డబ్బులు గెలుచుకుంటున్నా చాలామంది వీటికి బానిసలుగా మారుతున్నారు. ఈ జూదంలో చిక్కుకుంటున్నారు...’అని పేర్కొన్నాడు.

Scroll to load tweet…

కాగా ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 22న విచారణ చేపట్టేందుకు ముజఫర్‌పూర్ న్యాయస్థానం అంగీకించింది. ఐపీఎల్ లో రోహిత్, హార్ధిక్, గంగూలీలతో పాటు అమీర్ ఖాన్ లు ‘డ్రీమ్ 11’కు ప్రచారకర్తలుగా ఉన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ జరుగుతున్న క్రమంలో ఇందుకు సంబంధించిన యాడ్స్ కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. వీళ్లే కాదు.. యువ క్రికెటర్లు అర్ష్‌దీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, మహ్మద్ సిరాజ్ లు కూడా ఈ యాడ్స్ లో కనిపిస్తున్నారు. మరి ఈ పిల్ పై ముజఫర్‌పూర్ న్యాయస్థానం ఏ తీర్పు వెలువరించేనోనని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. 

Scroll to load tweet…