SRH Coaching Staff: ప్రపంచంలోనే ఒకప్పుడు అగ్రస్థాయి ఆటగాళ్లుగా వెలుగొందిన క్రికెటర్లను కోచింగ్ సిబ్బందిగా నియమించింది సన్  రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం.  ఈ మేరకు వారిని అభిమానులకు పరిచయం చేసింది.

ఇటీవలే ముగిసిన ఐపీఎల్-14లో పేలవమైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్.. వచ్చే సీజన్లో మాత్రం తిరిగి కప్పు కొట్టాలని పట్టుదలతో ఉన్నది. పలు కారణాల రీత్యా ఆ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. రిటైన్ చేసుకోకపోయినా ప్రపంచంలోనే ఒకప్పుడు అగ్రస్థాయి ఆటగాళ్లుగా ఉన్న క్రికెటర్లను కోచింగ్ సిబ్బందిగా నియమించింది. సన్ రైజర్స్ కు తొలి టైటిల్ (2016లో) అందించిన హెడ్ కోచ్ టామ్ మూడీని అదే స్థానంలో కొనసాగించిన యాజమాన్యం... బ్యాటింగ్ కోచ్ గా బ్రియాన్ లారాను నియమించింది. 

ఇన్నాళ్లు సన్ రైజర్స్ హైదరాబాద్ కు బ్యాటింగ్ కోచ్ గా ఉన్న వెటరన్ వీవీఎస్ లక్ష్మణ్.. ఇటీవలే జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కు హెడ్ గా వెళ్లడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో విండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ను బ్యాటింగ్ కోచ్ గా నియమించింది ఎస్ఆర్హెచ్ యాజమాన్యం. ఇక దక్షిణాఫ్రికా స్పీడ్ దిగ్గజం డేల్ స్టెయిన్.. పేస్ బౌలింగ్ కోచ్ గా నియమించింది.

ముత్తయ్య మురళీ ధరన్ స్పిన్ బౌలింగ్ కోచ్ గా కొనసాగనున్నాడు. ఆసీస్ మాజీ సారథి సైమన్ కటిచ్ అసిస్టెంట్ కోచ్ గా నియమితుడయ్యాడు. భారత జట్టు మాజీ ఆటగాడు హేమంగ్ బదానీ ఫీల్డింగ్ కోచ్ గా నియమితుడయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలను సన్ రైజర్స్.. ట్విట్టర్ ద్వారా పంచుకుంది. కోచింగ్ సిబ్బందిని అభిమానులకు పరిచయం చేసింది. 

Scroll to load tweet…

పూర్తి జాబితా ఇది :

టామ్ మూడీ - హెడ్ కోచ్ 
సైమన్ కటిచ్ - అసిస్టెంట్ కోచ్
బ్రియాన్ లారా - బ్యాటింగ్ కోచ్ 
డేల్ స్టెయిన్ - ఫాస్ట్ బౌలింగ్ కోచ్
ముత్తయ్య మురళీధరన్ - స్పిన్ బౌలింగ్ కోచ్
హేమంగ్ బదానీ - ఫీల్డింగ్ కోచ్ అండ్ స్కౌట్ 

వీళ్లంతా ఐపీఎల్ 2022 సీజన్ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ తో భాగస్వాములు కానున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ లో ఇద్దరు దిగ్గజాలే కోచ్ లుగా వ్యవహరిస్తుండటంతో ఆ రెండు విభాగాల్లో ఈసారి హైదరాబాద్ అద్భుతాలు సృష్టిస్తారని జట్టు యాజమాన్యం భావిస్తున్నది. ఇక అసిస్టెంట్ కోచ్ గా సైమన్ కటిచ్ అనుభవం కూడా జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నది. 

ఇదిలాఉండగా.. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో సన్ రైజర్స్ జట్టు కేన్ విలియమ్సన్ (రూ. 14 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 4 కోట్లు), అబ్దుల్ సమద్ (రూ. 4 కోట్లు) లను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. జట్టు యాజమాన్యంతో గొడవల కారణంగా డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ ను వీడాడు. ఇక స్పిన్నర్ అబ్దుల్ రషీద్ కూడా తాను డిమాండ్ చేసినంత ఇవ్వలేదనే కారణంతో హైదరాబాద్ కు గుడ్ బై చెప్పాడు.