రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ... వరుసగా నో బాల్స్ వేసి భారీ మూల్యం చెల్లించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు... 

ఐపీఎల్ 2021 సీజన్‌లో ముచ్చటగా మూడంటే మూడు విజయాలు అందుకుని, ఆఖరి స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 2022 సీజన్‌లో కొత్త జట్టుతో బరిలో దిగిన విషయం తెలిసిందే. జట్టులో ఎన్ని మార్పులు చేసినా, సన్‌రైజర్స్ ఆట మాత్రం మారనట్టే కనిపిస్తోంది...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. మ్యాచ్ ఆరంభంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు వరుసగా నో బాల్స్ సమర్పించారు. భువీ వేసిన మొదటి ఓవర్‌లో జోస్ బట్లర్ షాట్‌కి ప్రయత్నించి క్యాచ్ ఇచ్చాడు. అయితే అది నో బాల్‌గా తేలడంతో బట్లర్ నాటౌట్‌గా తేలాడు...

ఆ తర్వాత మూడో ఓవ‌ర్‌లోనూ మరో నో బాల్ వేశాడు భువనేశ్వర్ కుమార్. ఉమ్రాన్ మాలిక్ వేసిన నాలుగో ఓవర్‌లో ఓ నో బాల్ రాగా స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా నో బాల్ సమర్పించాడు. ఐదో ఓవర్లలోనే ఐదు నో బాల్స్ వేశారు సన్‌రైజర్స్ బౌలర్లు... రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు రాజస్థాన్ బ్యాటర్స్... 

ఆరు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. 16 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, రొమారియో స్టిఫర్ట్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేసిన జోస్ బట్లర్, ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో కీపర్ పూరన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన సన్‌రైజర్స్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది. ఐపీఎల్‌లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి ఇంగ్లాండ్ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు జోస్ బట్లర్. ఆ తర్వాత దేవ్‌దత్ పడిక్కల్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేసి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 55 పరుగులు చేసిన సంజూ శాంసన్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

సిమ్రాన్ హెట్మయర్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేసి నటరాజన్ వేసిన ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు. 9 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి రియాన్ పరాగ్ కూడా నట్టూ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ రెండేసి వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్, రొమారియో చెరో వికెట్ తీశారు. భువీ మినహా మిగిలిన ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించారు. గత సీజన్‌లో 140 - 150 పరుగుల ఈజీ టార్గెట్‌ను ఛేజ్ చేయడానికే అపసోపాలు పడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈసారి ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించగలదా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.