ఇండియా వర్సెస్ శ్రీలంక రెండో టెస్టు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ... జయంత్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్కి అవకాశం...
శ్రీలంకతో జరుగుతున్న రెండో టస్టులో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్తో పోలిస్తే ఒకే ఒక్క మార్పుతో బరిలో దిగింది భారత జట్టు... శ్రీలంక జట్టు రెండు మార్పులతో బరిలో దిగుతోంది. మంచి ఫామ్లో ఉన్న పథుమ్ నిశ్శంక గాయం కారణంగా రెండో టెస్టుకి దూరం కాగా, లహిరు కుమార స్థానంలో ప్రవీణ్ జయవిక్రమకి తుది జట్టులో అవకాశం దక్కింది.
మొహాలీ టెస్టులో అటు బ్యాటుతో, ఇటు బంతితో రాణించలేకపోయిన జయంత్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్ తుది జట్టులోకి వచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు ఇది 400వ అంతర్జాతీయ మ్యాచ్. అభిమానుల నుంచి భారీ డిమాండ్ వస్తుండడంతో రెండో టెస్టు మ్యాచ్కి 100 శాతం ప్రేక్షకుల మధ్య నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ...
భారత మాజీ సారథి విరాట్ కోహ్లీకి చిన్నస్వామి స్టేడియంలో మంచి రికార్డు ఉంది. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఇది హోం గ్రౌండ్... ఎక్కువ ఐపీఎల్ మ్యాచులు ఈ మైదానంలోనే ఆడిన విరాట్ కోహ్లీ, తన కెరీర్లో 100వ టెస్టు ఇక్కడే ఆడాలని భావించాడు. అయితే బీసీసీఐ షెడ్యూల్ మార్చడంతో నూరో టెస్టు మొహాలీలో ఆడాల్సి వచ్చింది...
బెంగళూరు టెస్టు మ్యాచ్, భారత నయా సారథి రోహిత్ శర్మ కెరీర్లో 400వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. ఓవరాల్గా 400+ ఆడబోతున్న 34వ ప్లేయర్గా నిలవబోతున్న రోహిత్ శర్మ, భారత జట్టు తరుపున ఈ ఘనత సాధించబోతున్న 9వ ప్లేయర్గా నిలుస్తాడు...
భారత జట్టు తరుపున సచిన్ టెండూల్కర్ (664), ఎమ్మెస్ ధోనీ (538), రాహుల్ ద్రావిడ్ (509), విరాట్ కోహ్లీ (457), మహ్మద్ అజారుద్దీన్ (433), సౌరవ్ గంగూలీ (424), అనిల్ కుంబ్లే (403), యువరాజ్ సింగ్ (402) మ్యాచులతో రోహిత్ కంటే ముందున్నారు...
తొలి టెస్టులో ఇన్నింగ్స్లో 222 పరుగుల తేడాతో ఓడిన శ్రీలంక జట్టు, డే నైట్ టెస్టుగా జరిగే రెండో టెస్టులో గెలవకపోయినా కనీసం డ్రా చేసుకుంటే చాలని కోరుకుంటోంది...
పింక్ బాల్ టెస్టుకి కెప్టెన్గా వ్యవహరించబోతున్న రెండో ఇండియన్ కెప్టెన్గానూ రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ...ఇప్పటిదాకా భారత జట్టు నాలుగు డే నైట్ టెస్టు మ్యాచులు ఆడింది. బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, పింక్ బాల్ టెస్టులో శతకం నమోదు చేసిన మొట్టమొదటి భారత ప్లేయర్ రికార్డు క్రియేట్ చేశాడు...
విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి వచ్చిన ఆఖరి సెంచరీ కూడా అదే. ఈ సెంచరీ తర్వాత రెండున్నరేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోతున్నాడు విరాట్...
శ్రీలంక జట్టు: దిముత్ కరుణరత్నే, లహిరు తిరుమన్నే, కుశాల్ మెండీస్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వ, చరిత్ అసలంక, నిరోషన్ డిక్వాలా, సురంగ లక్మల్, లసిత్ ఎంబూల్దెనియా, విశ్వ ఫెర్నాండో, ప్రవీణ్ జయవిక్రమ
భారత జట్టు: మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా
