INDvsAUS: భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో రోహిత్ సేన బ్యాటింగ్ లో దారుణ వైఫల్యంతో ఓటమి ఎదుట నిలిచింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ లో భారత్ గెలవడం అసాధ్యమే.. కానీ ఆ అద్భుతాలు తొలి రెండు టెస్టులలో జరిగాయి.
వరుసగా రెండు టెస్టులలో గెలిచామన్న అత్యుత్సాహమో లేక వీళ్లేం (ఆస్ట్రేలియా) చేస్తార్లే అన్న అతి నమ్మకమో గానీ మూడో టెస్టులో టీమిండియా ఓటమి అంచున నిలిచింది. స్పిన్ పిచ్ ల వెంట పడి తాను తీసిన గోతిలో తానే పడింది. తొలి రెండు టెస్టులలో ప్రత్యర్థిని ఏ ఆయుధంతో దెబ్బకొట్టిందో ఇదే ఇప్పుడు మన మెడకూ చుట్టుకుంది. ఇండోర్ టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్ ధాటికి భారత్ రెండు ఇన్నింగ్స్ లలోనూ దారుణంగా విఫలమైంది. రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులకే ఆలౌట్ అయి ప్రత్యర్థి ఎదుట 76 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. ప్రపంచ నెంబర్ వన్ టీమ్ కు ఈ టార్గెట్ సరిపోతుందా..?
మరో నాలుగు రోజుల ఆట మిగిలుంది. తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే ఆలౌట్ అయిన భారత జట్టు ప్రత్యర్థిని రెండో రోజే కట్టడి చేసిన తీరు అద్భుతం. కానీ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చాక కూడా భారత బ్యాటర్ల తడబాటు తప్పలేదు.
కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, కోహ్లీ, రవీంద్ర జడేజా, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్, అశ్విన్.. ఇలా క్రీజులోకి వచ్చిన బ్యాటర్లెవరూ ఇక్కడుండానికి తమకు ఏమాత్రం ఆసక్తి లేదన్నట్టుగా ఆడారు. ఫలితంగా రెండో రోజు మరో నాలుగు ఓవర్ల ఆట మిగిలుండగానే భారత్ ఆలౌట్ అయింది.
ఈ టార్గెట్ సరిపోతుందా..?
రెండు రోజుల్లో మూడు ఇన్నింగ్స్ లు ముగిశాయి. ఈ టెస్టులో ఇప్పటివరకు 30 వికెట్లు కూలగా.. అందులో రెండు జట్లలో కలిపి స్పిన్నర్లు తీసినవే 25 వికెట్లూ స్పిన్నర్లకే పడ్డాయి. సాధారణంగానే భారత్ పిచ్ లు మూడో రోజు నుంచి స్పిన్నర్లకు అనుకూలిస్తాయి. అయితే ఎంత అనుకూలించినా కనీసం 200 ప్లస్ టార్గెట్ ఉంటే అయినా బౌలర్లు కూడా ధీమాగా బౌలింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఉన్నదే రెండంకెల లక్ష్యం. అదీ ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా ఉన్న జట్టుతో... ఎంత అశ్విన్, జడేజా లు మాయ చేసినా కంగారూ బ్యాటర్లు 76 పరుగులు చేయలేరా..? అన్నది ఇప్పుడు ప్రతీ భారత అభిమానిని ఆందోళనకు గురి చేస్తున్న ప్రశ్న..
ఛాన్స్ ఉంది కానీ...
ఈ మ్యాచ్ లో గెలవడానికి భారత్ కు పూర్తిగా అవకాశాలు మూసుకుపోయాయని అనడానికి లేదు. ఇప్పటికే బంతి గింగిరాలు తిరుగుతున్న ఇండోర్ పిచ్.. మూడో రోజు నుంచి మరింత టర్న్ అవుతుంది. భారత స్పిన్ త్రయం అశ్విన్ - అక్షర్ - జడేజా మెరుగ్గా రాణించగలిగితే ఆస్ట్రేలియాను 75 పరుగుల లోపు ఆలౌట్ చేయడం కష్టమేమీ కాదు. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్ లో 185-4గా ఉన్న ఆ జట్టు.. 12 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లను కోల్పోయి 197 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇటువంటి సంచలన స్పెల్ లు శుక్రవారం కూడా పునరావృతమైతే మ్యాచ్ భారత్ దే. అదీగాక తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 91 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక్క సెషన్ కూడా పూర్తిగా ఆడకుండానే ఆ జట్టు చాప చుట్టేసింది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో కూడా ఆసీస్.. 113 పరుగులకే ఆలౌట్ అయింది. ఢిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో కూడా 84-2గా ఉన్న ఆసీస్ స్కోరు.. 113 పరుగులకు ఆలౌట్ అయింది. అంటే 29 పరుగులకు మిగిలిన 8 వికెట్లు పడ్డాయి. భారత అభిమానులు కూడా ఇండోర్ లో శుక్రవారం భారత బౌలర్ల నుంచి ఇటువంటి ప్రదర్శనలే ఆశిస్తున్నారు. మరి ఈ ట్రోఫీలో ఇప్పటివరకు ఆసీస్ పనిపట్టిన అశ్విన్ - జడేజాలు రేపు ఇండోర్ లో ఏం చేస్తారనేది ఆసక్తికరం... !
