137 పరుగులకి శ్రీలంక ఆలౌట్... 91 పరుగుల తేడాాతో భారీ విజయం అందుకున్న టీమిండియా.. 2-1 తేడాతో టీ20 సిరీస్ కైవసం..
రెండో టీ20లో 16 పరుగుల తేడాతో పోరాడి ఓడిన టీమిండియా... మూడో టీ20లో ఘన విజయం అందుకుంది. 229 పరుగుల భారీ టార్గెట్తో బరిలో దిగిన శ్రీలంక, 16.4 ఓవర్లలో 137 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కుశాల్ మెండిస్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో 4.4 ఓవర్లలో 44 పరుగులు చేసింది శ్రీలంక...
అయితే 15 బంతుల్లో 2 ఫోర్లు,2 సిక్సర్లతో 23 పరుగులు చేసిన కుశాల్ మెండిస్ని అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. 17 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన పథుమ్ నిశ్శంకను అర్ష్దీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు.
ఆవిష్క ఫెర్నాండో 1 పరుగు చేసి హార్ధిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ కావడంతో 51 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. చరిత్ అసలంక 19 పరుగులు, లంక కెప్టెన్ దసున్ శనక 23 పరుగులు చేసి లంకను ఆదుకునే ప్రయత్నం చేశారు...
వానిందు హసరంగ 9, మహీష్ తీక్షణ 2 పరుగులు చేయగా దిల్షాన్ మదుశంక 1 పరుగు చేశాడు. చమికా కరుణరత్నే డకౌట్ కాగా కసున్ రజిత్ 2 ఫోర్లతో 9 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్కి 3 వికెట్లు దక్కగా హార్ధిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్, యజ్వేంద్ర చాహాల్ రెండేసి వికెట్లు తీశారు. శివమ్ మావికి ఒకే ఓవర్ బౌలింగ్ ఇవ్వగా అక్షర్ పటేల్ ఓ వికెట్ తీశాడు.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగుల భారీ స్కోరు చేసింది.. 1 పరుగుకే అవుటై ఓపెనర్ ఇషాన్ కిషన్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచగా వన్డౌన్లో క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
కరుణరత్నే బౌలింగ్లో వరుసగా రెండు సిక్సర్లు బాది భారత జట్టు స్కోరు 50 మార్కు దాటించిన రాహుల్ త్రిపాఠి, ఆ తర్వాతి బంతికి మదుశంకకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన రేంజ్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న సూర్యకుమార్ యాదవ్.. టీ20ల్లో 1500 పరుగులు పూర్తి చేసుకున్నాడు...
36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసిన శుబ్మన్ గిల్, వానిందు హసరంగ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ కలిసి మూడో వికెట్కి 111 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 4 బంతుల్లో 4 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.
తొలి బంతికి ఫోర్ బాదిన దీపక్ హుడా, మదుశంక బౌలింగ్లో హసరంగకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా సూర్యకుమార్ యాదవ్ మాత్రం తన స్టైల్లో బ్యాటింగ్ కొనసాగించాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 112 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, టీ20ల్లో మూడో సెంచరీ నమోదు చేశాడు.
టీమిండియా తరుపున టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన రెండో బ్యాటర్గా రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో నిలిచాడు సూర్యకుమార్ యాదవ్.. అక్షర్ పటేల్ 9 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేశాడు..
