INDvsAUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈనెల 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్టు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్ చూసేందుకు భారత్ - ఆస్ట్రేలియాల ప్రధానులు అహ్మదాబాద్ రానున్నారు.
భారత్ - ఆస్ట్రేలియాల మధ్య బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇదివరకే మూడు టెస్టులు ముగియగా నాలుగో మ్యాచ్ వచ్చే గురువారం (మార్చి 9) నుంచి అహ్మదాబాద్ వేదికగా మొదలుకానున్నది. ఇదివరకే సిరీస్ లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు.. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను 3-1 తేడాతో చేజిక్కించుకోవాలని భావిస్తున్నది. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు గాను భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ అహ్మదాబాద్ రానున్నారు.
నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ ను మార్చి 9న (తొలి రోజు) వీక్షించేందుకు ఇరు ప్రధానులు రానున్న నేపథ్యంలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) ఫ్యాన్స్ కు షాకిచ్చింది. ప్రధానుల రాక సందర్భంగా తొలి రోజుకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్ లో బ్లాక్ చేసింది.
ఇరు దేశాల ప్రధానుల రాక నేపథ్యంలో భద్రతా సమస్యలు తలెత్తకుండా తొలి రోజు ప్రేక్షకులను మ్యాచ్ చూసేందుకు అనుమతించడం లేదని సమాచారం. జీసీఏ ఈ మేరకు ఆన్ లైన్ లో తొలి రోజు టికెట్లను బ్లాక్ చేయడం చర్చనీయాంశమైంది. అయితే ప్రధానులిద్దరూ రోజంతా మ్యాచ్ ను చూడటం కష్టం. వాళ్లిద్దరూ గంటకు మించి కూడా మ్యాచ్ చూసేది అనుమానమే. మరి ప్రధానులు ఉన్నంతసేపు స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించరా..? లేక పూర్తిగా తొలి రోజు మొత్తానికి అనుమతించరా..? అన్న విషయంలో స్పష్టత లేదు.
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియమైన అహ్మదాబాద్ లో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ ఆడటం ఆటగాళ్లకు కూడా ఏదో వెలితిగానే ఉంటుంది. అదీగాక ఈ సిరీస్ లో తొలి రోజే మ్యాచ్ ఫలితాలు తేలిపోతున్నాయి. గడిచిన మూడు టెస్టులలో కూడా తొలి రోజు ఆటే ఫలతాన్ని నిర్దేశించింది.
మూడు రోజుల్లో ముగుస్తున్న ఈ టెస్టులలో తొలి రోజు ఆట మిస్ అయితే ఇక మిగిలింది ఒక్క రోజు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. గత మూడు టెస్టులలో ఏ మ్యాచ్ లో కూడా ఇరు జట్లూ మూడో రోజు చివరి వరకూ ఆడలేదు. ఇండోర్ టెస్టు అయితే మూడో రోజు తొలి సెషన్ లోనే ముగిసింది.
కాగా జీసీఏ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు మండిపడుతున్నారు. కీలక టెస్టును ప్రత్యక్షంగా చూడాలనుకుంటే ఇలా చేయడం బాగోలేదని జీసీఏతో పాటు బీసీసీఐ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు.
