ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 విజేతగా నిలిచింది ఆస్ట్రేలియా. వరుసగా రెండోసారి ఫైనల్ చేరినా టీమిండియా, టైటిల్ గెలవలేకపోయింది. 2023 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ముగియగానే 2023-25 సీజన్‌కి సంబంధించిన షెడ్యూల్‌ని విడుదల చేసింది ఐసీసీ...


ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 విజేతగా నిలిచింది ఆస్ట్రేలియా. వరుసగా రెండోసారి ఫైనల్ చేరినా టీమిండియా, టైటిల్ గెలవలేకపోయింది. 2023 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ముగియగానే 2023-25 సీజన్‌కి సంబంధించిన షెడ్యూల్‌ని విడుదల చేసింది ఐసీసీ...

బిజీ బిజీగా టీమిండియా:

2023-25 సీజన్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా పర్యటనలో 5 టెస్టులు (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ), సౌతాఫ్రికా పర్యటనలో 2 టెస్టులు, వెస్టిండీస్ పర్యటనలో రెండు టెస్టులు ఆడనుంది... అలాగే వచ్చే రెండేళ్లలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడనున్న టీమిండియా... ఇంగ్లాండ్‌తో 5 టెస్టులు, న్యూజిలాండ్‌తో 3 టెస్టులు ఆడుతుంది.. 

యాషెస్ సిరీస్‌తోనే ఆరంభం:
జూన్ 16 నుంచి మొదలయ్యే యాషెస్ సిరీస్‌తో 2023-25 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ సీజన్ మొదలు కానుంది. వచ్చే రెండేళ్లలో ఆస్ట్రేలియా, ఇండియా 19 టెస్టులు ఆడబోతుంటే ఇంగ్లాండ్ 21 టెస్టులు ఆడనుంది. న్యూజిలాండ్, పాకిస్తాన్ 14 టెస్టులు, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, శ్రీలంక 12 టెస్టులు ఆడబోతుంటే వెస్టిండీస్ 13 టెస్టులు ఆడనుంది..

సౌతాఫ్రికాకి లక్కీ ఛాన్స్:

స్వదేశంలో టీమిండియా, పాకిస్తాన్, శ్రీలంకలతో టెస్టు సిరీస్‌లు ఆడబోతున్న సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, వెస్టిండీస్‌ల్లో పర్యటించనుంది. సరిగ్గా ఆడితే సౌతాఫ్రికా ఈసారి ఫైనల్ చేరడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.. 2021-23 ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ సీజన్‌లోనూ ఆఖరి వరకూ ఫైనల్ రేసులో నిలిచిన సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ చేతుల్లో టెస్టు సిరీస్ ఓడడంతో ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది..

వెస్టిండీస్ పర్యటన నుంచే ఆరంభం: 

జూలై 12న వెస్టిండీస్‌తో తొలి టెస్టు ఆడే భారత జట్టు, 20న రెండో టెస్టు ఆడుతుంది... డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో ఫ్రీడమ్ ట్రోఫీ, వచ్చే ఏడాది జనవరి-ఫ్రిబవరి నెలల్లో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లు ఉంటాయి. సెప్టెంబర్ 2024లో బంగ్లాదేశ్‌తో, అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో, డిసెంబర్-జనవరి 2025 మాసాల్లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లు ఆడుతుంది టీమిండియా..

ఛాంపియన్‌ టీమ్‌ షెడ్యూల్ ఇది:
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 గెలిచిన ఆస్ట్రేలియా, వచ్చే సీజన్‌లో స్వదేశంలో టీమిండియాతో 5 టెస్టులు, పాకిస్తాన్‌తో 3 టెస్టులు, బంగ్లాదేశ్‌తో 2 టెస్టులు ఆడుతుంది. ఇంగ్లాండ్‌ పర్యటనలో 5 టెస్టుల యాషెస్ తర్వాత న్యూజిలాండ్‌, శ్రీలంక పర్యటనల్లో రెండేసి టెస్టులు ఆడనుంది..

ఇంగ్లాండ్ కథ ఇది:

ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్ ముగిసిన తర్వాత స్వదేశంలోనే శ్రీలంకతో 2 టెస్టులు, వెస్టిండీస్‌తో 3 టెస్టులు ఆడుతుంది. ఇండియా పర్యటనలో 5, న్యూజిలాండ్, పాకిస్తాన్ పర్యటనల్లో మూడేసి టెస్టులు ఆడనుంది ఇంగ్లాండ్ టీమ్..

కివీస్‌కి కష్టమే:

2021 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ విన్నర్ న్యూజిలాండ్ జట్టు ఈసారి స్వదేశంలో ఆస్ట్రేలియాతో 2, ఇంగ్లాండ్‌తో 3, సౌతాఫ్రికాతో 2 టెస్టులు ఆడనుంది. అలాగే బంగ్లాదేశ్, శ్రీలంక పర్యటనల్లో రెండేసి, భారత్ పర్యటనలో మూడు టెస్టులు ఆడనుంది.

పాక్‌ ప్రయత్నిస్తే..:

పాకిస్తాన్‌కి ఈసారి ఫైనల్ చేరడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. స్వదేశంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లతో రెండేసి టెస్టులు ఆడుతున్న పాకిస్తాన్, ఇంగ్లాండ్‌తో 3 టెస్టులు ఆడుతుంది. అలాగే ఆస్ట్రేలియా పర్యటనలో 3, సౌతాఫ్రికా, శ్రీలంక పర్యటనలో రెండేసి టెస్టులు ఆడనుంది పాక్ టీమ్.. 


గత రెండు సీజన్లలో ప్రకటించినట్టే ఈసారి కూడా ఫైనల్‌ని లండన్‌లోని లార్డ్స్‌లో నిర్వహించబోతున్నట్టు షెడ్యూల్‌లో తెలిపింది ఐసీసీ. అయితే గత రెండు సీజన్లలో ఫైనల్ వేదిక మారింది. ఈసారి కూడా అదే జరగొచ్చు..