IPL 2023: గుజరాత్ టైటాన్స్ సారథి హార్ధిక్ పాండ్యాకు ఐపీఎల్-16లో భాగంగా నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ నచ్చలేదట. మ్యాచ్ ముగిసన తర్వాత పాండ్యా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచిన గుజరాత్ టైటాన్స్.. మళ్లీ గెలపు బాట పట్టింది. కోల్కతా నైట్ రైడర్స్ తో ఓటమి తర్వాత పంజాబ్ పై ఆల్ రౌండ్ షో తో అదరగొట్టింది. పంజాబ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించింది. అయితే గుజరాత్ సారథి హార్ధిక్ పాండ్యాకు మాత్రం ఈ మ్యాచ్ ఇలా ముగియడం నచ్చలేదట. మ్యాచ్ ముగిసన తర్వాత పాండ్యా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పాండ్యా మాట్లాడుతూ.. ‘వాస్తవంగా ఈ మ్యాచ్ ఇంత దూరం వెళ్తుందని నేను ఊహించలేదు. ఈ మ్యాచ్ నుంచి మేం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మిడిల్ ఓవర్స్ లో మేం కొన్ని రిస్కీ షాట్స్ ఆడాం. ఆటలో ఇటువంటివి సహజమే అయినా మేం మా తప్పుల నుంచి నేర్చుకోవాల్సి ఉంది...
మొహాలీ వంటి వికెట్ పై బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. ఈ సీజన్ లో గుజరాత్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన మోహిత్ తన అనుభవన్నంతా ఉపయోగించి బాగా బౌలింగ్ చేశాడు. వాస్తవానికి ఈ మ్యాచ్ ను మేం ముందే ఫినిష్ చేస్తే బాగుండేది. కానీ ఆఖరి ఓవర్ వరకూ తీసుకొచ్చాం. నాకు మ్యాచ్ లు ఇలా చివరి ఓవర్ వరకూ రావడం పెద్దగా నచ్చవు...’అని చెప్పాడు.
బౌలర్లపై ప్రత్యేక ప్రశంసలు కురిపించిన హార్ధిక్.. మోహిత్, అల్జారీ జోసెఫ్ లను ప్రత్యేకంగా అభినందించాడు. నెట్ బౌలర్ గా తమతో చేరిన అతడు అవకాశాల కోసం వేచి ఉండి అవకాశం వచ్చినప్పుడు చాలా చక్కగా వినియోగించుకున్నాడని చెప్పాడు. ఈ మ్యాచ్ లో రెండు వికెట్లు తీసిన మోహిత్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. పంజాబ్ తో మ్యాచ్ లో మోహిత్.. 4 ఓవర్లు వేసి 18 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత పంజాబ్ సారథి శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. తమ బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయామని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో తాము తప్పులను సరిదిద్దుకోవాలని అన్నాడు. ఈ మ్యాచ్ లో తాము 56 డాట్ బాల్స్ ఆడామని టీ20లలో ఇలా ఆడితే ఓడిపోకుంటే ఇంకేం చేస్తామని చెప్పాడు. ఆరంభంలోనే వికెట్లను కోల్పోవడం తమను దెబ్బతీసిందని.. సన్ రైజర్స్ తో గత మ్యాచ్ లో కూడా ఇలాగే జరిగిందని ఆందోళన వ్యక్తం చేశాడు.
