Sania Mirza: కెరీర్ చరమాంకంలో ఉన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన చివరి వింబూల్డన్ (?) మ్యాచ్ ను పరాజయంతో ముగించింది. మ్యాచ్ అనంతరం  ఆమె ఎమోషనల్ అయింది. 

భారత వెటరన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన చివరి వింబూల్డన్ మ్యాచ్ ను ఓటమితో ముగించింది. ఇక నిన్ను మళ్లీ కలుస్తానో లేదో.. మిస్ యూ.. అని ఎమోషనల్ అయింది. వింబూల్డన్ మిక్స్డ్ డబుల్స్ లో భాగంగా గురువారం జరిగిన మిక్స్డ్ డబుల్స్  సెమీస్ లో క్రొయేషియా కు చెందిన మేట్ పావిక్ తో కలిసి బరిలోకి దిగింది సానియా మీర్జా. ఈ మ్యాచ్ లో సానియా-పావెక్ ల జోడీ 6-4, 5-7, 4-6 తేడాతో క్రాజిక్-స్కుప్స్కీ జోడీ చేతిలో  ఓటమి పాలైంది. దీంతో చివరి వింబూల్డన్ లో ట్రోఫీ నెగ్గాలన్న సానియా కలలు కల్లలయ్యాయి.  

ఓటమి అనంతరం సానియా తన సోషల్ మీడియా ఖాతాలో భావోద్వేగ లేఖను షేర్ చేసింది.  20 ఏండ్లుగా వింబూల్డన్ లో ఆడుతున్న సానియా.. ఇక ‘నిన్ను మిస్ అవుతున్నాను. మళ్లీ కలుస్తానో లేదో.. కలిసేవరకు గుడ్ బై’అని పోస్ట్ చేసింది. 

సెమీస్ మ్యాచ్ ఓటమి తర్వాత సానియా స్పందిస్తూ.. ‘ఆట మీకు ఎంతో ఇస్తుంది. మానసికంగా.. శారీరకంగా.. భావోద్వేగపరంగా.. విజయాలు, ఓటములు. నిద్రలేని రాత్రులు.. కఠోర శ్రమ.. చేదు ఫలితాలు.. కన్నీళ్లు, సంతోషం.. పోరాటం, సవాళ్లు.. కానీ మిగతా ఏ ఉద్యోగం ఇవ్వలేని సంతృప్తి క్రీడల ద్వారా వస్తున్నందుకు నేను కృతజ్ఞురాలిని. వింబూల్డన్  ఒక అద్భుతం. గడిచిన 20 ఏండ్లుగా ఇక్కడ ఆడుతుండటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. మనం మళ్లీ కలిసేదాకా.. నేను నిన్ను మిస్ అవుతాను..?’ అని రాసుకొచ్చింది. 

 

View post on Instagram
 

ఉమెన్స్ డబుల్స్ లో  ప్రపంచ నెంబర్ వన్ అయిన  సానియా.. గతంలో  వింబూల్డన్ తో పాటు ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ ఓపెన్ లను (ఉమెన్స్ డబుల్స్ విభాగంలో) గెలచుకుంది. అంతేగాక ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్ లలో కూడా ట్రోఫీలు గెలుచుకుంది. 

సానియా వింబూల్డన్ జర్నీ.. 2001 లో ప్రారంభమైంది. జూనియర్ స్థాయి నుంచి మొదలుపెట్టిన ఆమె.. 2015 వింబూల్డన్ ఫైనల్ లో ఉమెన్స్ డబుల్స్ ఈవెంట్ లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత సానియా సెమీస్ కు చేరడం ఇదే తొలిసారి.  కానీ చివరి వింబూల్డన్ లో ఆమె సెమీస్ లోనే వెనుదిరగడం ఆమెకు తీరని లోటు. త్వరలోనే సానియా మీర్జా  టెన్నిస్ కు గుడ్ బై చెప్పనున్నట్టు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. 

 

Scroll to load tweet…