IPL 2022 Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులో రెండు జట్లు ఇప్పటికే బెర్త్ ను దాదాపు ఖాయం చేసుకున్నాయి. అయితే మూడు, నాలుగు స్థానాల కోసం ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. ఆ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే నేడు, రేపు జరిగే మ్యాచులు ఆ ఆరు జట్లకు కీలకం కానున్నాయి.
శనివారం, ఆదివారం వచ్చిందంటే చాలు.. నెలన్నర రోజులుగా ఐపీఎల్ అభిమానులకు పండుగ వచ్చినట్టే. మిగతా రోజుల్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఉంటే ఈ రెండు రోజుల్లో మాత్రం ఒకేరోజు రెండేసి మ్యాచులు జరుగుతాయి. అయితే ఈ శనివారం, ఆదివారం మాత్రం మరింత ప్రత్యేకం కానుంది. ఈ రెండ్రోజుల్లో జరిగే నాలుగు మ్యాచులలో ఆరు జట్ల ప్లేఆఫ్స్ భవితవ్యం తేలనుంది. ఈ మ్యాచులలో గెలిచిన జట్లే ప్లేఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంటాయి. ఆ ఆరు జట్లే రాజస్తాన్, పంజాబ్, హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, బెంగళూరు
శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు పంజాబ్ కింగ్స్-రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఆడిన 10 మ్యాచులలో 6 నెగ్గి నాలుగు ఓడి 12 పాయింట్లతో ఉన్న రాజస్తాన్ గత రెండు మ్యాచులలో అనూహ్య పరాజయం అందుకుంది. ఆ జట్టుకు మరో రెండు మ్యాచులు గెలిచినా ప్లేఆఫ్ అవకాశం ఉంటుంది.అయితే పంజాబ్ తో ఓడితే ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసులో వెనుకబడ్డట్టే.
పంజాబ్ విషయానికొస్తే.. 10 మ్యాచుల్లో ఐదు గెలిచి అన్నేమ్యచులు ఓడిన ఆ జట్టు.. ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే నేటితో పాటు తర్వాత జరుగబోయే 3 మ్యాచుల్లో నెగ్గాల్సి ఉంటుంది. నేటి మ్యాచ్ లో రాజస్తాన్ తో ఓడితే పంజాబ్ కథ అంతే..
కోల్‘కథ’ తేలనుంది..
శనివారం రాత్రి లక్నో వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇప్పటికే 10 మ్యాచుల్లో 7 గెలిచి 3 ఓడిన లక్నో.. 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నా దానికి ప్లేఆఫ్ చేరాలంటే మరో విజయం కావాల్సిందే. తర్వాత మ్యాచ్ వరకు ఆగకుండా ఇవాళే కేకేఆర్ ను ఓడించి ఆ ముచ్చట కూడా తీర్చుకోవాలని లక్నో భావిస్తున్నది.
ఇక 10 మ్యాచులలో 4 మాత్రమే నెగ్గి 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న కేకేఆర్ కు కూడా ప్లేఆఫ్ చేరాలంటే లక్నోతోపాటు మిగిలిన 3 మ్యాచులు గెలవాలి. ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలు వదులుకున్న ఆ జట్టు.. ఈ మ్యాచ్ లో ఓడితే ఇక అంతే..
ఆదివారం హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీకి దడ..
ఆదివారం మధ్యాహ్నం ఎస్ఆర్హెచ్-ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. వరుసగా ఐదు విజయాల తర్వాత తిరిగి 3 ఓటములతో నిలిచిన సన్ రైజర్స్ కు ప్లేఆఫ్స్ చేరాలంటే ఇకపై జరుగబోయే నాలుగు మ్యాచుల్లో కనీసం మూడైనా నెగ్గాల్సిందే. ఈ సీజన్ లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీని చిత్తుచిత్తుగా ఓడించిన హైదరాబాద్.. అదే ఫలితాన్ని రిపీట్ చేయాలని భావిస్తున్నది. మరోవైపు ఆర్సీబీ కూడా ప్రతీకారం తీర్చుకోవాలనే భావనతో ఉంది. 11 మ్యాచులాడిన ఆర్సీబీ.. 6 విజయాలు, 5 పరాజయాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ జట్టు ఆడబోయేది మరో 3 మ్యాచులు మాత్రమే. ఇందులో ఏ ఒక్కటి ఓడినా అది ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలపై గండి పడ్డట్టే..
ఢిల్లీ పరిస్థితీ దాదాపు అంతే. ఈ సీజన్ లో పడుతూ లేస్తూ వస్తున్న ఆ జట్టు.. ఐదో స్థానంలో నిలిచినా తర్వాత జరుగబోయే మూడు మ్యాచుల్లో గెలవాల్సిందే. ఆదివారం రాత్రి చెన్నైతో జరుగబోయే మ్యాచులో ఇప్పటికే దెబ్బతిన్న చెన్నై ని మరో దెబ్బ కొట్టాలని ఢిల్లీ భావిస్తున్నది. కానీ ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న ధోని సేన.. ఢిల్లీకి షాకులివ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా చెన్నైకి వచ్చేది లేదు, పోయేది అంతకన్నా లేదు. దీంతో ఆ జట్టు తెగించి ఆడొచ్చు. ఇదే జరిగి ఫలితం తేడా అయితే ఢిల్లీకి కూడా చుక్కలే..
