Corona Out break in Team India Squad: కరోనా నిర్ధారణ పరీక్షలో ఐదుగురు ఆటగాళ్లతో పాటు కోచింగ్ స్టాఫ్ నలుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వన్డే సిరీస్ నిర్వహణ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.
కరోనా మహమ్మారి టీమిండియాను మరోసారి దెబ్బతీసింది. త్వరలో వెస్టిండీస్ తో ప్రారంభం కాబోతున్న వన్డే సిరీస్ కు ముందు భారత జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, నవదీప్ సైనీ లతో పాటు ఇంకా జట్టుతో చేరని అక్షర్ పటేల్ కూడా వైరస్ బారిన పడ్డాడు. దీంతో ఫిబ్రవరి 6న జరగాల్సి ఉన్న మొదటి వన్డేపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో సిరీస్ జరుగుతుందా..? లేదా..? అనేది అనుమానంగానే మారింది.
బుధవారం రాత్రి నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో ధావన్, రుతురాజ్, శ్రేయస్, నవదీప్ సైనీ తో పాటు కోచింగ్ స్టాఫ్ నలుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైరస్ సోకినవారిలో టీమిండియా సహాయక సిబ్బందికి సంబంధించిన కార్ డ్రైవర్ కూడా ఉన్నాడు. గురువారం ఉదయం నిర్వహించిన పరీక్షలో అక్షర్ పటేల్ కు కూడా పాజిటివ్ గా తేలింది.
ప్రస్తుతం భారత జట్టు అహ్మదాబాద్ లోని హయత్ రెజెన్సీ హోటల్ లో స్టే చేస్తున్నది. సిరీస్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లంతా మూడు రోజులు క్వారంటైన్ లో ఉండాలని బీసీసీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. ఏకంగా ఐదుగురు ఆటగాళ్లకు పాజిటివ్ రావడంతో సిరీస్ నిర్వహణ పై బీసీసీఐకి స్పందించింది.
కేసులు పెరిగితే...
బోర్డుకు సంబంధించిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకైతే షెడ్యూల్ మేరకే సిరీస్ ను నిర్వహిస్తాం. కానీ ఈరోజు, రేపు పాజిటివ్ కేసులు పెరిగితే మాత్రం చర్చించి నిర్ణయం తీసుకుంటాం. బహుశా కేసులు పెరిగితే తొలి వన్డేను రెండ్రోజులు వెనక్కి జరిపే అవకాశం ఉంది...’ అని తెలిపారు.
అగర్వాల్ కు చోటు..
ఇక కరోనా కలవరంతో భారత జట్టు బుధవారం ట్రైనింగ్ సెషన్ ను రద్దు చేసింది. ధావన్, రుతురాజ్, అయ్యర్, నవదీప్ సైనీలు ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. ఇదిలాఉండగా.. ఐదుగురికి కరోనా నిర్ధారణ కావడంతో మయాంక్ అగర్వాల్ ను తుది జట్టులోకి చేర్చుతున్నట్టు ఆలిండియా సెలెక్షన్ కమిటీ తెలిపింది.
వెస్టిండీస్ తో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు మూడు వన్డేలు ఆడనున్నది. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా నిర్వహించబోయే ఈ వన్డేలకు ప్రేక్షకులను అనుమతించబోమని ఇప్పటికే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించిన విషయం తెలిసిందే.
వన్డే సిరీస్ షెడ్యూల్ :
ఫిబ్రవరి 6న తొలి వన్డే : నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
ఫిబ్రవరి 9న రెండో వన్డే : నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
ఫిబ్రవరి 11న మూడో వన్డే : నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
వన్డే సిరీస్ కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్) , కెఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవిభిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్
