Asianet News TeluguAsianet News Telugu

ఛతేశ్వర్ పూజారా, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలు... తొలి టెస్టులో కుదురుకుంటున్న టీమిండియా...

కెరీర్‌లో 34వ టెస్టు హాఫ్ సెంచరీ అందుకున్న ఛతేశ్వర్ పూజారా... రిషబ్ పంత్‌, శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన పూజారా... 

Cheteshwar Pujara half centuries, Shreyas Iyer impressive Team India vs Bangladesh 1st Test
Author
First Published Dec 14, 2022, 2:24 PM IST

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కుదురుకుంటోంది. 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత జట్టుని రిషబ్ పంత్‌తో పాటు ఛతేశ్వర్ పూజారా, శ్రేయాస్ అయ్యర్ కలిసి ఆదుకున్నారు. రిషబ్ పంత్ 46 పరుగులు చేసి అవుట్ కాగా, ఛతేశ్వర్ పూజారా, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు...

తన స్టైల్‌లో 125 బంతుల్లో టెస్టుల్లో 34వ హాఫ్ సెంచరీ అందుకున్నాడు ఛతేశ్వర్ పూజారా. మరో ఎండ్‌లో శ్రేయాస్ అయ్యర్ కూడా తన స్టైల్‌లో నిలకడైన ప్రదర్శన ఇస్తున్నాడు.  శ్రేయాస్ అయ్యర్ 93 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ కలిసి టీమిండియా స్కోరు 200+ దాటించారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకి శుభారంభం దక్కలేదు. రోహిత్ శర్మ గాయం కారణంగా తప్పుకోవడంతో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు. ఇద్దరూ నెమ్మదిగా ఆడుతూ తొలి వికెట్‌కి 41 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

40 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో యాసిర్ ఆలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా. 54 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసిన కెప్టెన్ కెఎల్ రాహుల్, ఖలీద్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

ఆఖరి వన్డేలో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ... 5 బంతులాడి 1 పరుగుకే అవుట్ అయ్యాడు. తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు విరాట్. డీఆర్‌ఎస్ తీసుకున్నా ఉపయోగం లేకపోయింది. 

48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, 45 బంతుల్లో 6 ఫోర్లు,2 సిక్సర్లతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ కొట్టిన రిషబ్ పంత్, ఆ తర్వాతి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 112 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది భారత జట్టు.. ఈ దశలో రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతూ బంగ్లా బౌలర్లపై కౌంటర్ అటాక్ చేశాడు...

అంతర్జాతీయ క్రికెట్‌లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న రిషబ్ పంత్, టెస్టుల్లో 50 సిక్సర్ల ఫీట్‌ని అందుకున్నాడు. రోహిత్ శర్మ 51 ఇన్నింగ్స్‌ల్లో 50 టెస్టు సిక్సర్లు బాదగా, రిషబ్ పంత్ 54 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.

ఓవరాల్‌గా పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ 46 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించి టాప్‌లో ఉంటే రోహిత్ శర్మ, రిషబ్ పంత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే బంతుల వారీగా చూసుకుంటే మాత్రం రోహిత్ శర్మ కంటే తక్కువ బంతుల్లో 50 సిక్సర్లు బాదేశాడు రిషబ్ పంత్...

గత 7 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 89 సగటుతో పరుగులు చేశాడు రిషబ్ పంత్. సౌతాఫ్రికా టూర్‌లో 100 చేసి నాటౌట్‌గా నిలిచిన రిషబ్ పంత్, ఆ తర్వాత 96, 39, 50, 146, 57, 46 పరుగులు చేసి మొత్తంగా 534 పరుగులు రాబట్టాడు..

16 పరుగుల వద్ద ఎబదత్ హుస్సేన్ బౌలింగ్‌లో ఛతేశ్వర్ పూజారా ఇచ్చిన క్యాచ్‌ని నురుల్ హసన్ జారవిడిచాడు. 16 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న పూజారా... బంగ్లా బౌలర్లకు మరో ఛాన్స్ ఇవ్వకుండా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios