వచ్చే ఏడాది యూఎస్ - విండీస్ వేదికగా జరుగబోయే టీ20 వరల్డ్ కప్ తో పాటు  2025లో పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వేదికలపై ఐసీసీ పునరాలోచించనుందని సమాచారం..!

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కు మరో భారీ షాక్.. ఆసియా కప్ - 2023 నిర్వహణ హక్కులు తెచ్చిన తంటాతో సతమతమవుతున్న పీసీబీకి.. 2025లో నిర్వహించబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా తరలిపోయే ప్రమాదముంది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇదివరకే పీసీబీకి తన నిర్ణయాన్ని సూత్రప్రాయంగా వెల్లడించినట్టు సమాచారం. వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్ కప్ తో పాటు 2025లో జరుగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వేదికలపై ఐసీసీ పునరాలోచించనుందని తెలుస్తున్నది. 

ఇదివరకే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమైతే 2024లో టీ20 వరల్డ్ కప్ ను యూఎస్, వెస్టిండీస్ లలో సంయుక్తంగా నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. అంతేగాక 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. ఇప్పుడు ఈ రెండూ వేదికలు మారబోతున్నాయి. 

టీ20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్‌కు.. ఛాంపియన్స్ ట్రోఫీ వెస్టిండీస్-యూఎస్‌కు..!

టీ20 వరల్డ్ కప్ నిర్వహించేందుకు వెస్టిండీస్ లో లాజిస్టిక్స్, ఇతర సమస్యలేమీ లేకపోయినా యూఎస్ లో మాత్రం ఇంకా అక్కడ క్రికెట్ పురుడుపోసుకునే దశలోనే ఉంది. స్టేడియాల నిర్మాణం కూడా అంతంతమాత్రమే. దీంతో కొత్త స్టేడియాలు, లాజిస్టిక్స్ సమకూర్చుకోవడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే వచ్చే నెల నుంచి అక్కడ మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) జరగాల్సి ఉంది. దీంతో అది ఎలా నిర్వహిస్తారు..? అన్నది చూసిన తర్వాత యూఎస్ లో టీ20 వరల్డ్ కప్ ఆడించాలా..? వద్దా..? అన్నదానిపై క్లారిటీ వస్తుంది.

అయితే ఐసీసీ మాత్రం టీ20 వరల్డ్ కప్ ను యూఎస్ - విండీస్ ను తరలించి ఇంగ్లాండ్ లో నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. ఈ రెండు దేశాలకు టీ20 వరల్డ్ కప్ నిర్వహణకు బదులు 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను ఇవ్వనుందని సమాచారం. 

పాకిస్తాన్ కు నష్టపరిహారం..? 

2025లో పాకిస్తాన్ వేదికగా జరుగాల్సి ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీని ఆ దేశం నుంచి తరలిస్తే అక్కడ నిరసనలు మొదలవుతాయి. దీంతో ఆ నష్టాన్ని పూడ్చడానికి గాను ఐసీసీ.. పీసీబీకి నష్టపరిహారం (నగదు రూపంలో) ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. మరి దీనికి పీసీబీ ఒప్పుకుంటుందా..? లేదా..? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే.. 

కారణమిదేనా..? 

పాకిస్తాన్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీని తరలించడానికి బలమైన కారణమే ఉంది. ఆసియా కప్ - 2023 నిర్వహణ వివాదం పీసీబీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. భద్రతా కారణాల రీత్యా తాము పాకిస్తాన్ కు రాబోమని బీసీసీఐ తేల్చి చెప్పగా.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సభ్య దేశాలు (శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్) కూడా పాక్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ను తిరస్కరించాయి. ఇది ఇక్కడితో ముగిసిపోలేదు. ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆడుతుందా..? లేదా..? అన్నది క్లారిటీ లేదు. ఆసియా కప్ కే పాకిస్తాన్ కు వెళ్లని భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్తుందా..? అన్న ప్రశ్న తలెత్తడం సహజం. ఇతర దేశాలు కూడా బీసీసీఐకి మద్దతు పలికే అవకాశం లేకపోలేదు. మళ్లీ అప్పటికీ కొత్త తలనొప్పులు ఎందుకుని.. ఐసీసీ ఇప్పుడే అప్రమత్తమైనట్టుగా క్రికెట్ వర్గాలలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.