Ahmedabad franchise Name: పేరు విషయంలో లక్నో  టీమ్ నే ఫాలో అయిన అహ్మదాబాద్.. అంతా కంట్రోల్ సీ, కంట్రోల్ వీ వ్యవహారమే.. 

ఐపీఎల్ వేళానికి సమయం దగ్గరపడుతున్న వేళ అహ్మదాబాద్ ఫ్రాంచైజీ తన జట్టు అధికారిక పేరును ప్రకటించింది. ఆ జట్టు పేరును ‘గుజరాత్ టైటాన్స్’గా నామకరణం చేసింది. టీమిండియా ఆల్ రౌండర్ సారథ్యంలో ఉన్న అహ్మదాబాద్ ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్-వెస్టిండీస్ రెండో వన్డేకు ముందు అహ్మదాబాద్ జట్టు కు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హార్ధిక్ పాండ్యా.. తమ జట్టు పేరు ‘గుజరాత్ టైటాన్స్’ అని వెల్లడించాడు. 

ఇక పేరుతో పాటు జట్టు అధికారిక ట్విట్టర్ ఖాతాను, వెబ్ సైట్ ను కూడా నేడే విడుదల చేశారు. గుజరాత్ టైటాన్స్ పేరుతో ప్రారంభించిన ట్విట్టర్ ఖాతాలో తొలి ట్వీట్ ను ‘శుభ ఆరంభం’ అని రాసుకొచ్చింది ఆ ఫ్రాంచైజీ.. టీమ్ లోగో, జెర్సీ కి సంబంధించిన విషయాలను త్వరలోనే విడుదల చేయనున్నారు. 

Scroll to load tweet…

ఇదిలాఉండగా.. గుజరాత్ టైటాన్స్ పేరు పై ట్విట్టర్ లో నెటిజన్లు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్నోసూపర్ జెయింట్స్ మాదిరిగానే గుజరాత్ కూడా కట్, కాపీ, పేస్ట్ ఫార్ములా నే అనుసరించిందని కామెంట్లు పెడుతున్నారు. 2016, 2017 ఐపీఎల్ సీజన్ లో పూణె తో పాటు గుజరాత్ కూడా ఆడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆ జట్టుకు ‘గుజరాత్ లయన్స్’గా పేరు పెట్టారు నిర్వాహకులు. ఆ జట్టుకు సురేశ్ రైనా నాయకత్వం వహించాడు.

ఇక ఇప్పుడు ‘గుజరాత్ లయన్స్’లోని ‘లయన్స్’ ను తీసేసి ‘టైటాన్స్’ అని తగిలించడం గమనార్హం. ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరు ప్రకటించినప్పుడు కూడా ఇవే తరహా విమర్శలు వెల్లువెత్తాయి. లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా నే గతంలో ‘పూణె’ఫ్రాంచైజీకీ ఓనర్. ఆ సమయంలో పూణె పేరును ‘రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్’ గా నాయకరణం చేశారు. ఇక లక్నో కు కూడా సూపర్ జెయింట్స్ ను తీసుకొచ్చి తగిలించారనే విమర్శలు, మీమ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ పై కూడా అవే మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 

Scroll to load tweet…

కాగా.. హార్ధిక్ పాండ్యా (రూ. 15 కోట్లు) సారథ్యం వహిస్తున్న గుజరాత్.. ఇప్పటికే రషీద్ ఖాన్ (రూ. 15 కోట్లు), శుభమన్ గిల్ (రూ. 8 కోట్లు) లను దక్కించుకుంది. ఇంకా ఆ జట్టు ఖాతాలో రూ. 52 కోట్లు ఉన్నాయి. మిగిలిఉన్న నగదు తోనే ఆ జట్టు మిగిలిన జట్టును నిర్మించుకోవాల్సి ఉంది. ఆశిష్ నెహ్రా, గ్యారీ కిర్స్టెన్ లు అహ్మదాబాద్ కోచింగ్ సిబ్బంది గా ఉన్నారు. ఈనెల 12, 13 తేదీలలో బెంగళూరు వేదికగా ఐపీఎల్ వేలం నిర్వహించనున్న విషయం తెలిసిందే.