Corona In Delhi Capitals Camp: ఈ ఐపీఎల్ లో మరే జట్టుకు లేని బాధ ఢిల్లీ క్యాపిటల్స్ ను ముందునుంచీ వేధిస్తున్నది. రెండు వారాల క్రితం ఆ జట్టును వణికించిన కరోనా.. ఢిల్లీపై మళ్లీ పంజా విసిరింది.
ఐపీఎల్-15 ప్లేఆఫ్ రేసులో నేటి రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ తో కీలక మ్యాచ్ లో తలపడనున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఓసారి కరోనా భారిన పడ్డ ఆ జట్టు.. తాజాగా సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ చేసింది. సీఎస్కేతో మ్యాచ్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కు చెందిన నెట్ బౌలర్ ఒకరికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఢిల్లీ నెట్ బౌలర్ గా ఉన్న ఆ వ్యక్తి (పేరు వెల్లడించలేదు)కి కరోనా సోకడంతో అతడితోనే ఉంటున్న మరో నెట్ బౌలర్ కూడా ఐసోలేషన్ లోకి వెళ్లాడు. దీంతో జట్టు మొత్తం మళ్లీ ఐసోలేషన్ కు వెళ్లింది. నెలన్నర రోజులుగా మహారాష్ట్రలో సాగుతున్న ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు తప్ప మరే జట్టులో కూడా కరోనా టెన్షన్ లేదు. కానీ ఢిల్లీకి మాత్రం ఇది సెకండ్ వేవ్ వంటిది.
రెండు వారాల క్రితం రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచ్ కు ముందు ఢిల్లీ జట్టులోని ఫిజియో తో పాటు ఆటగాళ్లు మిచెల్ మార్ష్, టిమ్ సీఫర్ట్, మరో ముగ్గురికి కూడా కరోనా సోకింది. మరో నాలుగు రోజులకే ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కుటుంబసభ్యుల్లో ఒకరికి పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే.
అయితే తొలి రౌండ్ లో కరోనా సోకినవాళ్లంతా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు. మిచెల్ మార్ష్ ఆస్పత్రి పాలైనా తిరిగి కోలుకుని ఢిల్లీకి కీలక ఆటగాడిగా మారాడు. కాగా ప్లేఆఫ్స్ కోసం నేడు సీఎస్కేతో కీలక మ్యాచ్ ఆడనుంది ఢిల్లీ. ఈ మ్యాచ్ లో ఓడితే ఢిల్లీ ప్లేఆఫ్ అవకాశాలు మరింత కష్టమవుతాయి. అక్కడివరకు తెచ్చుకోవద్దని దెబ్బతిన్న సీఎస్కే ను మరింతగా ఇబ్బందులకు గురి చేయాలని ఢిల్లీ భావిస్తున్నది. అయితే ఢిల్లీ క్యాంప్ లో కరోనా కలవరంతో నేటి మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అనేదానిమీద ఇంకా స్పష్టత రాలేదు.
ఇక ఈ విషయం మీద బీసీసీఐ గానీ ఐపీఎల్ నిర్వాహకులు గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికైతే ఢిల్లీ ఆటగాళ్లంతా ఐసోలేషన్ లో గడుపుతున్నారు. వాళ్లందరికీ ఆదివారం ఉదయం కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక మ్యాచ్ కు రెండు గంటల ముందు కూడా మళ్లీ ఓసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలను బట్టి ఎంత మంది ఆడతారు..? ఎంతమంది అందుబాటులో ఉంటారు..? అనే విషయాలపై అవగాహన రానున్నది.
ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానం (10 మ్యాచులు 5 విజయాలు, 5 ఓటములు.. 10 పాయింట్లు) లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. తర్వాత జరుగబోయే నాలుగు మ్యాచులలో కనీసం మూడింట్లో అయినా గెలవాలి. రెండింట్లో గెలిచినా (14 పాయింట్లు) తో ప్లేఆఫ్ చేరే అవకాశం ఉంటుంది. కానీ నెట్ రన్ రేట్ మెరుగుపడాల్సి ఉంటుంది. ఇక ఆ జట్టు తర్వాత ఆడబోయే మ్యాచులు సీఎస్కే, రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తో ఉన్నాయి.
