WTC Finals 2023:  టీమిండియా వెటరన్ ప్లేయర్ అజింక్యా రహానే ఐపీఎల్-16లో ఆడిన ఒక్క ఇన్నింగ్స్ తో భారత జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. 

గత దశాబ్దంలో భారత టెస్టు జట్టులో కీలకంగా వ్యవహరించి ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో పాటు ఏకంగా జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే తిరిగి భారత జట్టులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడా...? జూన్ 7 నుంచి 12 వరకూ ఇంగ్లాండ్ లో ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ లో భాగంగా ఎంపిక చేసే 15 మందిలో రహానే ఉండనున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు.

గతేడాది దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ తర్వాత రహానే టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. పుజారా కూడా ఫామ్ లేమితో తంటాలు పడ్డా ఆ తర్వాత అతడు ఇంగ్లాండ్ కౌంటీలలో ఆడి ఫామ్ సంతరించుకుని తిరిగి టీమ్ తో చేరాడు. కానీ రహానే మాత్రం జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. సౌతాఫ్రికా టూర్ తర్వాత భారత్ ఆడిన శ్రీలంక, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ లతో పాటు ఇటీవలే ముగిసిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో కూడా సెలక్టర్లు అతడిని పక్కనబెట్టారు.

అయితే రెండ్రోజుల క్రితం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రహానే విశ్వరూపం చూపాడు. సీఎస్కే తరఫున వన్ డౌన్ లో వచ్చి వీరవిహారం చేశాడు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని మొత్తంగా 2 7 బంతుల్లోనే 61 పరుగులతో అందరికీ షాకిచ్చాడు. సీఎస్కే రూ.16 కోట్లతో బెన్ స్టోక్స్ రెండు మ్యాచ్ లలో దారుణంగా విఫలమై ముంబైతో మ్యాచ్ లో పక్కనబెట్టింది. కానీ అతడి స్థానంలో వచ్చిన రహానే మాత్రం దుమ్మురేపాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్ తో రహానే మళ్లీ అభిమానులతో పాటు భారత జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టిలోనూ పడ్డాడు. తాజా సమాచారం మేరకు.. రహానే త్వరలోనే జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడే ప్రాబబుల్స్ లో ఒకడిగా ఉన్నాడని తెలుస్తున్నది. 

Scroll to load tweet…

పీటీఐ సమాచారం మేరకు.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, అతడి కోచింగ్ సిబ్బందితో కలిసి త్వరలో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఎ) లో సమావేశం కానున్నాడు. ఈ సమావేశంలోనే సెలక్టర్లు కూడా పాల్గొననున్నారని, టీమ్ సెలక్షన్ గురించి కూడా చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది.

అయ్యర్ కు గాయం కూడా కలిసొచ్చేదే.. 

వాస్తవానికి టీమిండియాలో అయ్యర్ టెస్టు జట్టులోకి రాకముందు వరకూ రహానే అంతగా రాణించకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ మిడిలార్డర్ లో అయ్యర్ నిలకడగా ఆడుతుండటం, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్ల రాకతో రహానే కనుమరుగయ్యాడు. కానీ ఈ ఏడాది టెస్టులలో కెఎల్ రాహుల్ దారుణ వైఫల్యాలు, అయ్యర్ కు వెన్ను గాయంతో పాటు వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా దూరం కావడం రహానేకు కలిసొచ్చేదే. మిడిలార్డర్ లో ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కోవడం భారత జట్టుకు కీలకం. 2020, 2021లో భారత జట్టు ఆస్ట్రేలియాకు పర్యటించిన జట్టులో ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్న అనుభవం రహానేకు ఉంది. ఇది కూడా రహానే కు కలిసొచ్చేదే.. మరి రహానే తిరిగి భారత జట్టుతో చేరతాడా..? లేదా..? అన్నది త్వరలోనే తేలనుంది.