KKR vs DC : వైజాగ్ లో బౌండరీల వర్షం కురిసింది. ఫోర్లు, సిక్సర్ల మోత కొనసాగింది. ఢిల్లీ బౌలింగ్ ను చిత్తు చేసిన కేకేఆర్ ఐపీఎల్ 2024 సీజనల్ అత్యధిక స్కోర్ చేసిన రెండో టీమ్ గా ఘనత సాధించింది.
IPL 2024 KKR vs DC KKR : ఐపీఎల్ 2024లో మరో మ్యాచ్ లో కేకేఆర్ పరుగుల వరద పారించింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించాడు. ఢిల్లీ బౌలింగ్ ను తునాతునకలు చేస్తూ విరుచుకుపడ్డారు. దీంతో కేకేఆర్ ఈ మ్యాచ్ లో అనేక రికార్డులు బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్ ద్వారా పవర్ ప్లే లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా కేకేఆర్ నిలిచింది. సునీల్ నరైన్ తన (85 పరుగులు) అత్యధిక వ్యక్తిగత స్కోర్ ను నమోదుచేశాడు. ఈ సీజన్ లో రెండో అత్యధిక స్కోర్ (272 పరుగులు)చేసిన ఘనతను కూడా సాధించింది.
వైజాగ్ వేదికగా ఢిల్లీ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ బ్యాటింగ్ బౌలింగ్ లో అదరగొట్టింది. టాస్ గెలిచిన కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఓవర్ లో నెమ్మదించిన ఫిల్ సాల్ట్ 2వ ఓవర్లో 2 బౌండరీలు బాది యాక్షన్ ప్రారంభించాడు. ఖలీల్ అహ్మద్ వేసిన 3వ ఓవర్లో 3 ఫోర్లు సహా 15 పరుగులు వచ్చాయి. ఇక 4వ ఓవర్ లో విధ్వంసం కొనసాగింది. ఇషాంత్ శర్మ వేసిన 4వ ఓవర్లో సునీల్ నరైన్ 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 26 పరుగులు చేశాడు. 18 పరుగుల వద్ద దూకుడుగా ఆడుతున్న సాల్ట్ ఔట్ కావడంతో 18 ఏళ్ల అరంగేట్ర ఆటగాడు రఘువంశీ కేకేఆర్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. సునీల్ నరైన్ విధ్వంసం, రఘువంశీ ధనాధన్ ఇన్నింగ్స్ తో దుమ్మురేపారు. ఈ ఇద్దరు ప్లేయర్లు కలిసి ఢిల్లీ బౌలర్లను వైట్ వాష్ చేశారు. సునీల్ నరైన్ 21 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో 6 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 88 పరుగులు చేసింది.
దీని తర్వాత కేకేఆర్ టీమ్ మరింత రెచ్చిపోయింది. కేకేఆర్ బ్యాట్స్మెన్ ప్రతి ఓవర్లో 2 సిక్స్లు లేదా 2 ఫోర్లు కొట్టి దూకుడుగా ఆడారు. దీంతో 11 ఓవర్లు ముగిసే సరికి జట్టు స్కోరు ఒక వికెట్ నష్టానికి 150 పరుగులకు చేరింది. దూకుడుగా ఆడిన సునీల్ నరైన్ సెంచరీ కొట్టేలా కనిపించాడు కానీ, 39 బంతుల్లో 7 సిక్సర్లు, 7 ఫోర్లతో 85 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరో ఎండ్ లో అరంగేట్రంలోనే రఘువంశీ అదరగొట్టాడు. అద్భుతంగా ఆడిన రఘువంశీ 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. భారీ షాక్ కు ఆడబోయే 54 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రస్సెల్-శ్రేయస్ అయ్యర్ భాగస్వామ్యంతో భారీ స్కోర్ చేసింది. 15.2 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ స్కోరు 200 పరుగులకు చేరుకుంది. రింగు సింగ్-రస్సెల్ భాగస్వామ్యం అదిరిపోయింది.
ఆ తర్వాత 19వ ఓవర్లో 3 సిక్సర్లు, ఒక బౌండరీతో సహా 25 పరుగులు పిండారు. ఈ ఓవర్ చివరి బంతికి రింగు సింగ్ ఔట్ అయ్యాడు కానీ, 8 బంతుల్లో 26 పరుగులు కొట్టడం విశేషం. 19 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఇషాంత్ శర్మను చివరి ఓవర్ వేయగా, తొలి బంతికి రస్సెల్ 41 పరుగుల వద్ద అవుట్ కాగా, 3వ బంతికి రమణదీప్ సింగ్ 2 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ ఓవర్ లో కేవలం 8 పరుగులు మాత్రమే రావడంతో కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.
