పవర్ ఫుల్ ఉమెన్ ప్రియాంక చోప్రా.. రోష్ని.. మజుందార్ కూడా
న్యూయార్క్: హెచ్సీఎల్ టెక్ సీఈఓ రోష్ని నాడార్, బయోటెక్నాలజీ దిగ్గజం కిరణ్ మజుందార్ షా, ప్రసార మాధ్యమాల నుంచి శోభనా భర్తియా, బాలీవుడ్ నటీమణి ప్రియాంకా చోప్రా అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
న్యూయార్క్: హెచ్సీఎల్ టెక్ సీఈఓ రోష్ని నాడార్, బయోటెక్నాలజీ దిగ్గజం కిరణ్ మజుందార్ షా, ప్రసార మాధ్యమాల నుంచి శోభనా భర్తియా, బాలీవుడ్ నటీమణి ప్రియాంకా చోప్రా అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అంతర్జాతీయంగా 100 మంది అత్యంత శక్తిమంత మహిళలతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో నలుగురు భారతీయులకు చోటు లభించింది. తొలి ఐదు స్థానాల్లో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ (64) ప్రథమస్థానంలో నిలిచారు.
బ్రిటన్ ప్రధాని థెరెసా మే (62) వరుసగా రెండో ఏడాదీ రెండో స్థానంలో నిలిచారు. ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టీన్ లగార్డే (3), జనరల్ మోటార్స్ సీఈఓ మేరి బర్రా (4), ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్ సీఈఓ అబిగైల్ జాన్సన్ 5వ స్థానంలో ఉన్నారు. ఏంజెలా మెర్కెల్కు వరుసగా ఎనిమిదేళ్ల పాటు ఫోర్బ్స్ జాబితాలో చోటు లభించడం విశేషం.
ఇక భారత్కు విషయానికి వస్తే 37 ఏళ్ల వయస్సు కల హెచ్సీఎల్ టెక్నాలజీ సీఈవో రోషిణి నాడార్ మల్హోత్రాకు 51వ స్థానం లభించింది. 8.1 బిలియన్ డాలర్ల విలువైన హెచ్సీఎల్ సంస్థ..టెక్నాలజీ, హెల్త్కేర్, ఇన్ఫోసిస్టమ్స్ విభాగాల్లో సేవలు అందిస్తున్నది. బయోకాన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ అయిన కిరణ్ మజుందార్ షా (65)కు 60వ స్థానం దక్కింది.
హెచ్టీ మీడియా సీఎండీ శోభనా భర్తియా (61)కి 88వ స్థానం లభించింది. 2013లో సింగపూర్ కేంద్రస్థానంగా బిజినెస్ వీక్లీ మింట్ఏషియాను ప్రారంభించారు. ఆ తర్వాతి క్రమంలో వెబ్, సోషల్, డిజిటల్ మీడియా రంగంలోకి ప్రవేశించారు.
నటి ప్రియాంకా చోప్రా (36)కు 94వ స్థానం దక్కింది. ఈమె చిత్ర నిర్మాణంతో పాటు టెక్ సంస్థల్లో పెట్టుబడులూ పెడుతున్నారు. అమెరికన్ సింగర్, యాక్టర్ నిక్ జోనస్ను ఇటీవల వివాహాం చేసుకున్నారు. వరుసగా రెండోసారి ఫోర్బ్స్ జాబితాలో ప్రియాంకా చోప్రా చోటు దక్కించుకున్నారు.
ఆరు విభాగాలకు ప్రాతినిధ్యం వహించిన ఈ జాబితాలో బిజినెస్ నుంచి 27 మందికి, టెక్నాలజీ నుంచి 18, ఆర్థిక నుంచి 12 మందికి, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్కు చెందిన 16 మందికి, రాజకీయాలు అండ్ పాలసీలకు 22, దాతృత్వంకు చెందిన 5 మంది మహిళలకు చోటు దక్కింది. ఈ శక్తివంతమైన మహిళలు మొత్తంగా 2 లక్షల కోట్ల డాలర్ల ఆదాయం సంపాదిస్తూ 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 28 ఏళ్ల వయస్సు కల టైలర్ స్విఫ్ట్కు, 92 ఏండ్లు కలిగిన క్వీన్ ఎలిజబెత్కు-2లకు చోటు లభించడం విశేషం. తొలిసారిగా అన్నె, సుసాన్లనై కవలలకు చోటు దక్కింది.