బ్యాంకర్లతోనే తంటా: శాశ్వతంగా జెట్ ఎయిర్వేస్ మూత?!
జెట్ ఎయిర్వేస్ సంస్థ పునరుద్దరణ పట్ల బ్యాంకర్లు సాచివేత ధోరణిని ప్రదర్శిస్తున్నారు. వారంలోగా కొత్త వాటాదారును ఎంపిక చేయకుంటే మరో వారంలో జెట్ ఎయిర్వేస్ సంస్థకు గల విదేశీ ఫ్లయింగ్ రైట్స్ను ఇతర సంస్థలకు కేటాయిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయం తీసుకోనుంది.
ఆర్థిక నష్టాల్లో కూరుకుని.. తాత్కాలికంగా మూసివేతకు గురైన జెట్ ఎయిర్వేస్ సంస్థ శాశ్వతంగా మూతపడే అవకాశాలు క్రమంగా బలపడుతున్నాయి. సంస్థకు కొత్త వాటాదారును కనుగొనే ప్రక్రియలో ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకర్లు జాప్యం చేస్తుండడంతో జెట్ ఎయిర్వేస్కు పెను ముప్పు ముంచుకొస్తోంది.
వారంలోగా కొత్త వాటాదారు ఎంపిక జరుగకుంటే..
వారంలోగా జెట్ ఎయిర్వేస్ సంస్థను ఆర్థిక కష్టాల నుంచి వెంటనే బయటపడేసేలా కొత్త వాటాదారు ఎంపిక జరగకపోతే ఆ సంస్థకు తీరని నష్టం కలుగనుంది. జెట్ ఎయిర్వేస్ సంస్థకు గల విదేశీ ఫ్లయింగ్ హక్కులను ప్రభుత్వ త్వరలోనే ఇతర వైమానిక సంస్థలకు పంపిణీ చేయనుంది.
మరో వారంలో జెట్ ఎయిర్వేస్ విదేశీ ఫ్లయింగ్ హక్కుల కేటాయింపు
మరో వారంలో జెట్ ఎయిర్వేస్ సంస్థకు గల విదేశీ ఫ్లయింగ్ హక్కుల కేటాయింపు ప్రక్రియను పౌరవిమానయాన శాఖ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెట్ విమానాలు నిలిచిపోయిన రూట్లలో తాము విమానాలను తిప్పనున్నట్టుగా ఇప్పటికే పలు సంస్థలు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాయి.
జెట్ ఎయిర్వేస్ బంగారు బాతు లాంటి రూట్లివే
జెట్ ఎయిర్వేస్ సంస్థకు బంగారు బాతులా సొమ్మును ఆర్జించిపెట్టిన సింగపూర్, థాయిలాండ్, మధ్య ప్రాచ్యం మార్గాల్లో ప్రస్తుతం విమానాల కొరత ఉంది. జెట్ మూతపడడంతో ఈ కొరత మరింతగా పెరిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మొబైల్ పేమెంట్ యాప్లకు భారీ జరిమానా
ఫోన్పేతో సహా నిబంధనలు ఉల్లంఘించిన ఐదు ప్రిపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (పీపీఐ) సంస్థలకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా భారీ జరిమానా విధించింది. ముఖ్యంగా వొడాఫోన్ ఎం-పేసా, ఫోన్ పే మొబైల్ పేమెంట్స్, వై-క్యాష్ తదితర సంస్థలు ఉన్నాయి.
అమెరికా సంస్థలకూ జరిమానా వడ్డింపు
వీటితో పాటు ప్రమాణాలు పాటించని అమెరికా సంస్థలు వెస్టర్న్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మనీగ్రామ్ పేమెంట్ సిస్టమ్స్పైనా ఆర్బీఐ కొరడా ఝళిపించింది. చెల్లింపులు, సెటిల్మెంట్స్ వ్యవస్థల చట్టం- 2007 కింద ఆయా సంస్థలకు ద్రవ్య పెనాల్టీ విధించినట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
వొడాఫోన్ ఎం-పైసాకు రూ.3.05 కోట్ల జరిమానా
వొడాఫోన్ ఎం-పేసాకు రూ.3.05 కోట్ల జరిమానా, మొబైల్ పేమెంట్స్, ఫోన్ పే, ప్రైవేట్ అండ్ జీఐ టెక్నాలజీలకు రూ.1 కోటి చొప్పున జరిమానా విధించింది. వై-క్యాష్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కి కూడా రూ. 5 లక్షల పెనాల్టీ విధించింది.
వీటితోపాటు వెస్టర్న్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మనీగ్రామ్ పేమెంట్ సిస్టమ్స్ సంస్థలకు వరుసగా రూ. 29.66 లక్షలు, రూ. 10.11 లక్షల మేర ఆర్బీఐ జరిమానా విధించింది.