కరోనాతో రియల్ ఎస్టేట్ రంగం డీలా: ఇళ్లు, ఫ్లాట్ల అమ్మకాలు శూన్యం..
కరోనా ప్రభావంతో నిర్మాణ రంగం ప్రత్యేకించి ‘రియాల్టీ’ విలవిల్లాడుతోంది. గతేడాదితో పోలిస్తే 81 శాతం విక్రయాలు తగ్గిపోయాయి. దీంతో కొత్త ప్రాజెక్టులకు బిల్డర్లు రాం రాం చెప్పేశారు.
న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో దేశంలో స్థిరాస్తి రంగం కుప్పకూలింది. కొవిడ్-19తో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పుణె, చెన్నై, బెంగళూరు, కోల్కతా నగరాల్లో ఇళ్లు, ఫ్లాట్ల అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య తొలి త్రైమాసికంలో 12,740 యూనిట్లకు మించకపోవచ్చని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘అనరాక్’ తెలిపింది.
గత ఏడాది ఇదే కాలంలో విక్రయించిన 68,600 యూనిట్లతో పోలిస్తే ఇది 81 శాతం తక్కువని తన తాజా నివేదికలో తెలిపింది. కొవిడ్-19 కట్టడి కోసం మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ రియల్టీ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని అన్ రాక్ పేర్కొంది.
ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్ల ప్రాజెక్టులే పూర్తిగా అమ్ముడుపోవడం లేదు. దీంతో కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు బిల్డర్లు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఈ ప్రభావం కొత్త ప్రాజెక్టులపైనా పడిందని అనరాక్ తెలిపింది.
also read ‘బాయ్కాట్ చైనా ప్రాడక్ట్స్’కు మద్దతివ్వండి: ముకేశ్ అంబానీ, రతన్ టాటాలకు లేఖ.. ...
గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో బిల్డర్లు దాదాపు 69వేల కొత్త ప్రాజెక్టులు చేపట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇది 98 శాతం తగ్గి 1,390 యూనిట్లకు పడిపోనుంది. దాదాపు 2 నెలలు విధించిన లాక్డౌన్తో అమ్మకాలతో పాటు కొత్త ప్రాజెక్టులూ ఎక్కడికక్కడ ఆగిపోయాయి.
హైదరాబాద్ రియల్టీ మార్కెట్పైనా కొవిడ్-19 ప్రభావం బాగానే కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త ఇళ్లు, ఫ్లాట్ల అమ్మకాలు.. దేశంలో మరే నగరంలో లేని విధంగా 85 శాతం మేర తగ్గుతాయని అనరాక్ వెల్లడించింది.
2019-20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో హైదరాబాద్ మార్కెట్లో 4,430 యూనిట్లు అమ్ముడవగా 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కొత్త ఇళ్లు, ఫ్లాట్ల అమ్మకాలు 660 యూనిట్లు మించవని అంచనా వేసింది. కాగా ఢిల్లీ, ముంబైలో 83 శాతం, బెంగళూరులో 77 శాతం, పుణె లో 79 శాతం, చెన్నైలో 84 శాతం, కోల్కతాలో 79 శాతం విక్రయాలు తగ్గొచ్చని అనరాక్ తెలిపింది.