Asianet News TeluguAsianet News Telugu

కరోనాకు కుబేరులూ ‘డింగ్’య్యారు: రూ.32 లక్షల కోట్లు లాస్

కోవిడ్ దెబ్బకు కుబేరులు సైతం కుంగిపోయారు. గత వారం మార్కెట్లు భారీగా పతనం కావడంతో, సాధారణ ఇన్వెస్టర్లకు మాత్రమే కాక కోటీశ్వరులకు సైతం కోట్ల రూపాయల సంపద పోయింది.

Coronavirus: World's richest lose $444 billion after hellish week for markets
Author
New Delhi, First Published Mar 1, 2020, 11:45 AM IST

వాషింగ్టన్: కోవిడ్ దెబ్బకు కుబేరులు సైతం కుంగిపోయారు. గత వారం మార్కెట్లు భారీగా పతనం కావడంతో, సాధారణ ఇన్వెస్టర్లకు మాత్రమే కాక కోటీశ్వరులకు సైతం కోట్ల రూపాయల సంపద పోయింది. ప్రపంచంలోని టాప్ 500 ధనికులకు మొత్తంగా కలిపి 444 బిలియన్ డాలర్లు అంటే రూ.32,04,570 కోట్ల సంపద పోయిందని బ్లూమ్‌‌‌‌బర్గ్ బిలీనియర్ ఇండెక్స్‌‌‌‌లో వెల్లడైంది.

కోవిడ్ వైరస్ చైనా వెలుపల విశ్వ రూపం చూపిస్తుండటంతో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంచనాలు వస్తున్నాయి. దీంతో 2008లో ఆర్థిక సంక్షోభం నెలకొన్నా, నాటికంటే దారుణంగా మార్కెట్లు పడటం, అంతకంటే ఎక్కువగా బిలీనియర్ల సంపద కరిగిపోవడం జరిగింది.
 ప్రపంచంలో టాప్ 3 ధనికులు అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌‌‌‌గేట్స్, ఎల్‌‌‌‌వీఎంహెచ్ ఛైర్మన్ బెర్నార్డ్ అర్నాల్డ్‌‌‌‌ సంపద భారీగా ఆవిరైంది. వీరికి మొత్తంగా కలిపి 3,000 కోట్ల డాలర్ల సంపద పోయింది. టెస్లా ఇంక్ షేర్లు పడిపోవడంతో, ఎలన్ మస్క్‌‌‌‌ సంపద 9 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది.

అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఆసియా మార్కెట్లన్నీ నష్టాలకే పరిమితం కావడంతో షేర్లన్నీ కుప్పకూలాయి. ప్రపంచ టాప్‌-10 శ్రీమంతులకు వాటిల్లిన నష్టం విలువే దాదాపు రూ.6 లక్షల కోట్లుగా ఉన్నది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ సంపద గత వారం సుమారు రూ.86 వేల కోట్లు పడిపోయింది.

టాప్‌-500 బిలియనీర్లకు ఈ ఏడాది ఆరంభం నుంచి 78 బిలియన్‌ డాలర్ల లాభాలు రాగా, ఒక్క వారంలోనే 444 బిలియన్‌ డాలర్లు పోయాయని బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ గుర్తుచేస్తున్నది. కేవలం గత ఐదు రోజుల్లో అమెరికా స్టాక్‌ మార్కెట్‌ డౌ జోన్స్‌ సగటున 12 శాతానికిపైగా క్షీణించింది. 

2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం నాటి నుంచి ఈ స్థాయిలో పతనం కావడం ఇదే. దీని ప్రభావంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు ఏకంగా 6 లక్షల కోట్ల డాలర్ల నష్టాలను చవిచూశాయి. భారతీయ స్టాక్‌ మార్కెట్లకూ భారీ నష్టాలు సంభవిస్తుండగా, శుక్రవారం ఒక్కరోజే బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 1,448 పాయింట్లు, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 432 పాయింట్లు కోల్పోయాయి. దీంతో రూ.5.45 లక్షల కోట్ల మదుపరుల సంపద కరిగిపోయింది. ఇక గత వారం రోజుల్లో సుమారు రూ.12 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ తరిగిపోయింది.

బిల్ గేట్స్ రూ.72,180 కోట్లు, అల్ఫాబెట్ అధినేత లర్రి ఫేజ్ రూ.46,195.2 కోట్లు, అమెరికా మోనిల్ కు చెందిన కార్లోస్ స్లిమ్ రూ.45,473.4 కోట్లు, అల్ఫాబెట్ సంస్థకు చెందిన సిర్గే బ్రిన్ రూ.44,751.6 కోట్లు, ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ రూ.47,638.8 కోట్లు, బెర్క్ షైర్ హాథవే అధినేత వారెన్ బఫెట్ రూ.63,518.4 కోట్లు, ఇండిటెక్స్ కు చెందిన అమెన్సియో ఒర్టెగా రూ.49,082.4 కోట్ల సంపద కోల్పోయారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios