జనవరి 1 నుంచి చెక్కులకు కొత్త రూల్స్.. మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఇవే..
కొత్త రూల్ ప్రకారం 50వేల కంటే ఎక్కువ చేసే చెల్లింపులకు కీలక వివరాలను మరోసారి పున-నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త చెక్ చెల్లింపు నియమం 1 జనవరి 2021 నుండి అమల్లోకి వస్తుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) కొన్ని నెలల క్రితం చెక్కు పేమెంట్ల కోసం 'పాజిటివ్ పే సిస్టమ్'ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కొత్త రూల్ ప్రకారం 50వేల కంటే ఎక్కువ చేసే చెల్లింపులకు కీలక వివరాలను మరోసారి పున-నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ కొత్త చెక్ చెల్లింపు నియమం 1 జనవరి 2021 నుండి అమల్లోకి వస్తుంది. పాజిటివ్ పే సిస్టమ్ విధానం పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ కూడా చేసింది.
వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చెక్కు చెల్లింపులకు సంబంధించి మోసపూరిత లావాదేవీలు, చెక్కు దుర్వినియోగ కేసులను తగ్గించడానికి ఆగస్టు ఎంపిసిలో ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.
పాజిటివ్ పే సిస్టమ్ అంటే ఏమిటి?
పాజిటివ్ పే సిస్టమ్ అనేది ఆటోమేటెడ్ మోసాల గుర్తింపు సాధనం. క్లియరింగ్ కోసం వచ్చిన చెక్కుకు సంబంధించి ప్రధాన సమాచారాన్ని బ్యాంకులు తిరిగి ధృవ పరచుకోవలసి ఉంటుంది. చెక్కు నంబర్, చెక్కు తేదీ, చెల్లింపుదారుడి పేరు, అక్కౌంట్ నంబర్, ఇతర పూర్తి వివరాలను పునఃసమీక్షించవలసి ఉంటుంది.
also read చైనాకు షాకిచ్చిన సామ్సంగ్ : వేలకోట్ల పెట్టుబడులు ఇండియాకు.. ...
చెక్కు పేమెంట్ కోసం కొత్త రూల్స్ గురించి తెలుసుకోవలసిన 5 విషయాలు:
1) పాజిటివ్ పే సిస్టమ్ అనేది పెద్ద మొత్తం విలువగల చెక్కులపై ముఖ్య వివరాలను మరోసారి తిరిగి ధృవీకరించే ప్రక్రియ ఉంటుంది.
2) చెక్కును జారీ చేసిన వ్యక్తి లేదా సంస్థ లబ్దిదారుడి పేరు, సొమ్ము మొత్తం తదితర వివరాలను వివిధ మార్గాల ద్వారా చెల్లించే(డ్రాయీ) బ్యాంకుకు తెలియజేయవలసి ఉంటుంది. ఈ వివరాలను ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం తదితరాల ద్వారా అందించవచ్చు.
3) సీటీఎస్లలో పాజిటివ్ పే వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అభివృద్ధి చేయడంతోపాటు.. పార్టిసిపేటింగ్ బ్యాంకులకు సైతం అందించవలసి ఉంటుంది. రూ.50వేల లేదా అంతకుమించి విలువగల చెక్కులకు ఈ కొత్త రూల్ అమలుకానుంది.
4) ఈ వ్యవస్థను రూ. 5 లక్షల లోపు సొమ్ము విషయంలో ఖాతాదారుని అభీష్టంమేరకే అమలు చేయవలసి ఉంటుందని తెలుస్తోంది.
5) రూ. 5 లక్షల మొత్తానికి మించిన చెక్కులకు బ్యాంకులు ఈ విధానాన్ని తప్పనిసరి చేయనున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి.
ఎస్ఎంఎస్ అలెర్ట్స్, బ్రాంచ్ డిస్ ప్లే, ఎటిఎంలతో పాటు బ్యాంక్ వెబ్సైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పాజిటివ్ పే సిస్టమ్ గురించి బ్యాంకులు వినియోగదారులకు తగిన అవగాహన కల్పించాలని సూచించారు.