కాంగ్రెస్ తో టీడీపీ ఒప్పందం..బయటపెట్టిన కిశోర్ చంద్రదేవ్
కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కుదుర్చుకున్న ఒప్పందాన్ని... మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ బయటపెట్టారు.
కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కుదుర్చుకున్న ఒప్పందాన్ని... మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ బయటపెట్టారు. కిశోర్ చంద్రదేవ్.. ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆయన ఇటీవల విజయనగరం జిల్లా కురుపాలం కోటలో కార్యకర్తలతో మాట్లాడుతూ.. అసలు నిజాన్ని బయటపెట్టారు.
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావాలని రాహుల్, చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారని.. అందులో భాగంగానే తాను టీడీపీలో చేరినట్లు ఆయన కార్యకర్తలకు తెలిపారు. రానున్న ఎన్నికల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, టీడీపీ కలిపి పోటీ చేయవని కిషోర్ చంద్రదేవ్ తేల్చి చెప్పారు.
అయితే కేంద్రంలో తమ రెండు పార్టీలు పనిచేస్తాయని పేర్కొన్నారు. అందుకే తాను టీడీపీలో గెలిచి, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏ పని అయినా.. మీకు చేసి పెడతా అని కార్యకర్తలకు... హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీని భూస్థాపితానికి దుష్టశక్తులు పని చేస్తున్నాయన్న కిషోర్ చంద్రదేవ్... అలాంటివాళ్ల మధ్య ఇమడలేకే పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారం చేజిక్కించుకుంటే మాత్రం మంత్రి పదవి చేపట్టి అన్ని పనులు చేసిపెడతా అంటూ ఆయన బహిరంగంగా చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.