ప్రొద్దుటూరు టీడీపీ టిక్కెట్టు గొడవ: లింగారెడ్డి హెచ్చరికలు
ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ టిక్కెట్టు తనకే వస్తోందని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి చెప్పారు.
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ టిక్కెట్టు తనకే వస్తోందని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి చెప్పారు. తనకు కాకుండా మరోకరి టిక్కెట్టు ఇస్తే 40 వేల ఓట్లతో టీడీపీతో ఓటమి పాలు కానుందన్నారు. దీని ప్రభావం కడప ఎంపీ స్థానంపై కూడ పడుతోందని చెప్పారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో మంగళవారం నాడు లింగారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతీసారీ టిక్కెట్టును త్యాగం చేసేందుకు తాను శిబి చక్రవర్తిని కాదన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లా నుండి విజయం సాధించిన ఏకైక ఎమ్మెల్యే తానేనని లింగారెడ్డి గుర్తు చేశారు.
ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడ తాను మాత్రం టీడీపీలోనే కొనసాగినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు. గత ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు కాకుండా మరో వ్యక్తికి టిక్కెట్టు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తనకు టిక్కెట్టు ఇస్తే 30 వేల మెజారిటీతో విజయం సాధిస్తానని లింగారెడ్డి చెప్పారు. తనకు కాకుండా మరోకరికి టిక్కెట్టు ఇస్తే 40 వేలతో ఓటమి ఖాయమన్నారు.
ఇప్పటికే ఈ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కూడ టిక్కెట్టు ఆశిస్తున్నాడు. గత ఎన్నికల సమయంలో వరదరాజులు రెడ్డి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈ స్థానం నుండి సీఎం రమేష్ కూడ పోటీకి సిద్దంగా ఉన్నాడనే ప్రచారం కూడ సాగుతోంది. సీఎం రమేష్ పై మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.