చంద్రబాబు టీడీపీని ఏ క్షణమైనా కాంగ్రెస్లో కలిపేస్తారు: దాడి
ఏ క్షణంలోనైనా తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని దాడి జోస్యం చెప్పారు. చంద్రబాబుకు కావాల్సింది కేవలం పవర్ మాత్రమేనని సిద్ధాంతాలు ఆయనకు అవసరం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్ధాపించారని దాడి వీరభద్రరావు తెలిపారు. శనివారం హైదరాబాద్ లోటస్పాపండ్లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్తో సమావేశమైన ఆయన.. జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అనంతరం దాడి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెసేతర పక్షాలన్నింటిని ఏకంగా చేసి కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఇవాళ్టీ తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ ఆశయాలకు చోటు లేదని.. దానిని అసలు టీడీపీగానే చూసే పరిస్ధితి కనిపించడం లేదన్నారు.
ప్రస్తుతమున్నది తెలుగుదేశం పార్టీ కాదని ఇది తెలుగు కాంగ్రెస్గా వ్యవహరిస్తే మంచిదని దాడి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీని అనుబంధ సంస్థగా మార్చేశారని వీరభద్రరావు అన్నారు.
టీడీపీని రాహుల్ గాంధీ పాలిస్తున్నారో.. చంద్రబాబు పాలిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఏ క్షణంలోనైనా తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని దాడి జోస్యం చెప్పారు.
చంద్రబాబుకు కావాల్సింది కేవలం పవర్ మాత్రమేనని సిద్ధాంతాలు ఆయనకు అవసరం లేదన్నారు. జగన్ పాలన రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉందని దాడి తెలిపారు. కొన్ని స్థానిక పరిస్థితుల వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యానని దాడి స్పష్టం చేశారు.
ప్రపంచంలోనే ఇంతటి సుధీర్ఘమైన పాదయాత్ర చేసింది జగన్ ఒక్కరేనన్నారు. పాదయాత్ర తర్వాత జగన్లో రాజకీయ పరిణితి పెరిగిందన్నారు. చంద్రబాబుది మల్టీ టాంగ్ అని.. క్షణానికి ఒకలా మాట్లాడతారని దాడి ధ్వజమెత్తారు.