హిందూపురంలో బాలకృష్ణకు చుక్కెదురు
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకి సొంత నియోజకవర్గంలో చుక్కెదురైంది.
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకి సొంత నియోజకవర్గంలో చుక్కెదురైంది. రెండు రోజుల పాటు నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాహనాన్ని స్థానిక ప్రజలు, మహిళలు అడ్డుకొని నిరసన తెలిపారు.
చిలమత్తూరులో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు..శంకుస్థాపనలు చేసిన ఆయన లేపాక్షి నంది సర్కిల్ వద్దకు రాగానే..జనం ఆయన కారును అడ్డుకున్నారు. బాలకృష్ణ కారు దిగగానే చుట్టుముట్టారు.
హంద్రీనీవా ద్వారా లేపాక్షి మండలంలోని అన్ని చెరువులకు నీళ్లిస్తామని చెప్పి...చిన్న చెరువులను విస్మరించారని మండిడ్డారు. మహిళలైతే తాగేందుకు నీళ్లులేక అల్లాడిపోతున్నామని, పశువులకు నీళ్లు కూడా లేవని మండిపడ్డారు. మీకు చెప్పుకుందామంటే మీరెక్కడుంటారో తెలియకుండా పోయిందన్నారు.
పరిస్థితి చేజారుతోందని గ్రహించిన టీడీపీ నాయకులు మల్లికార్జున, ఎంపీటీసీ సభ్యుడు చలపతి, మాజీ ఎంపీపీ ఆనంద్ మరికొందరు ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. అయినప్పటికీ మహిళలు నీటికోసం గట్టిగా నిలదీశారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని వినతి పత్రం సమర్పించారు.