టీడీపీ ట్రాప్లో బీజేపీ.. అమిత్ షా వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి
ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలపై టీటీడీ చైర్మన్, వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.
విశాఖపట్నం: ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలపై టీటీడీ చైర్మన్, వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. విశాఖపట్నంకు వచ్చిన అమిత్ షా ఈ ప్రాంతం గురించి ఒక్క మాట కూడా చెప్పకపోవడం దారుణమని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి ఈరోజు జ్ఞానాపురంలో ఎర్నిమాంబ ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ట్రాప్లో బీజేపీ అగ్రనాయకత్వం పడిందని ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి బీజేపీలో చేరిన వ్యక్తులు చెప్పిన మాటలను అమిత్ షా పలకడం దారుణమని అన్నారు. తమ ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేస్తుందని.. అలాంటి ప్రభుత్వంపై అమిత్ షా నిందలు వేయడం సరికాదని అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఎవరితో కలిసి పోటీ చేసిందని ప్రశ్నించారు. గతంలో బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయనేది అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పసుపు కండువా మార్చి కాషాయ చొక్కాలు వేసుకున్న వాళ్ళు చెప్పిన మాటలను బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. మొన్న శ్రీకాళహస్తిలో.. నిన్న విశాఖపట్నంలో ఇదే జరిగిందని విమర్శించారు. తమ ప్రభుత్వం అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. విశాఖపట్నంలో మాట్లాడేటప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కనీసం మాట్లాడి ఉంటే బాగుండేదని అన్నారు.