Breaking : రేపు తాడేపల్లికి వైఎస్ షర్మిల .. సీఎం జగన్తో భేటీ
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రేపు తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందించనున్నారు షర్మిల.
![ysrtp chief ys sharmila to meet ap cm ys jagan on wednesday ksp ysrtp chief ys sharmila to meet ap cm ys jagan on wednesday ksp](https://static-ai.asianetnews.com/images/01gjz0wyyhtpfk9wvjxz88fcc6/sharmila--jagan-jpg_363x203xt.jpg)
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రేపు తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. బుధవారం కుటుంబ సమేతంగా కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్నారు షర్మిల. రేపు సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసంలో జగన్తో ఆమె భేటీ అవుతారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందించనున్నారు షర్మిల. వివాహ ఆహ్వాన పత్రికను అందించిన అనంతరం రేపు సాయంత్రం విజయవాడ నుంచే నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు షర్మిల.
అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని ఇది వరకే నిర్ణయించామన్నారు. మంగళవారం ఇడుపులపాయలో తన తండ్రి , దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించి నివాళులర్పించారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరిని తీసుకుని ఆమె అక్కడికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని గతంలోనే నిర్ణయించుకున్నామని .. అందుకే తెలంగాణలో ఆ పార్టీకి మద్ధతిచ్చానని చెప్పారు.
మా మద్ధతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, 31 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలవడానికి తాము పోటీ పెట్టకపోవడమే కారణమన్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసేందుకు బుధవారం ఢిల్లీ వెళ్తున్నానని.. రెండ్రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని షర్మిల తెలిపారు. తన కుమారుడికి వివాహం నిశ్చయమైన సందర్భంగా వైఎస్సార్ ఆశీస్సులు తీసుకునేందుకు ఇడుపులపాయ వచ్చినట్లు వెల్లడించారు.