అమరావతి రైతుల యాత్రకు భద్రత కల్పించండి : అమిత్ షాకు రఘురామ లేఖ
అమరావతి రైతుల పాదయాత్రకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. న్యాయస్థానం వెలువరించిన తీర్పుకు విరుద్ధంగా మంత్రులు మూడు రాజధానులపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని రఘురామ దుయ్యబట్టారు.
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మంగళవారం లేఖ రాశారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఉల్లంఘిస్తోందని ఆయన లేఖలో పేర్కొన్నారు. న్యాయస్థానం వెలువరించిన తీర్పుకు విరుద్ధంగా మంత్రులు మూడు రాజధానులపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని రఘురామ దుయ్యబట్టారు. అమరావతి రైతులు వెయ్యి కిలోమీటర్లు పాదయాత్ర చేస్తుండటంతో.. ఇందులో అలజడి సృష్టించడమే జగన్ సర్కార్ ఉద్దేశంగా కనిపిస్తోందని ఆయన లేఖలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు చేపట్టాలని అమిత్ షాను రఘురామ కోరారు.
అంతకుముందు బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్ స్కామ్లో రోహిత్ రెడ్డి, పినాక శరత్ చంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడు సూత్రధారులని ఆరోపించారు. అన్నా క్యాంటీన్లను కూల్చేస్తున్నట్లుగానే చంద్రబాబు ఇచ్చిన డిస్టిలరీని కూడా కూల్చేయవచ్చు కదా అంటూ రఘురామ ప్రశ్నించారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగిందని.. అడాన్ డిస్టిలరీకి రూ.200 కోట్ల బ్యాంక్ గ్యారెంట్ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ కుంభకోణం ఏదో ఒకరోజు బయటపడుతుందని రఘురామ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు సంబంధించి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయడం లేదని, లిక్కర్పై వచ్చే డబ్బును ఎక్కడకు తీసుకెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని రఘురామ స్పష్టం చేశారు.
ALso REad:లిక్కర్ స్కామ్లో పాత్రధారులు, సూత్రధారులు ఈ ముగ్గురే : రఘురామ సంచలన ఆరోపణలు
మరోవైపు.. అమరావతి రైతుల మహా పాదయాత్ర సోమవారం నాడు ప్రారంభమైంది. ఈ పాదయాత్రకు ఏపీ హైకోర్టు ఈ నెల 9వ తేదీన అనుమతిని ఇచ్చింది. దీంతో రైతులు ఇవాళ ఉదయం అమరావతిలోని వెంకటేశ్వరస్వామి ఆలయం నుండి పాదయాత్రను ప్రారంభించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అమరావతి జేఏసీ నిర్వహిస్తున్న ఆందోళనలు వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నాయి. దీంతో అమరావతిలోని వెంకటపాలెం వెంకటేశ్వరస్వామి ఆలయం నుండి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి ఆలయం వరకు అమరావతి రైతులు పాదయాత్ర నిర్వహించనున్నారు. సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది.