వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ: ఎంపీలకు జగన్ దిశానిర్ధేశం
వైసీపీ (వైఎస్ఆర్సీపీ) పార్లమెంటరీ పార్టీ సమావేశం గురువారం నాడు అమరావతిలో ప్రారంభమైంది. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై పార్లమెంట్ లో గళమెత్తాలని వైసీపీ ఎంపీలకు జగన్ దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ నెల 19 నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
అమరావతి: వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం గురువారం నాడు అమరావతిలో ప్రారంభమైంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ సమావేశం సాగుతోంది. ఈ నెల 19వ తేదీ నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ ఎంపీలకు జగన్ దిశా నిర్ధేశం చేయనున్నారు.కృష్ణా జలాల వివాదం, విశాఖ స్టీల్ ప్లాంట్ , ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, ఏపీకి కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయమై పార్లమెంట్లో ప్రస్తావించాలని వైసీపీ భావిస్తోంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇటీవల కాలంలో జల వివాదం ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ విషయమై జోక్యం చేసుకోవాలని ప్రధానికి, కేంద్ర జల్ శక్తి మంత్రికి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖలు రాశారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాలపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం చెబుతోంది.ఏపీకి కేంద్రం నుండి రావాల్సిన బకాయిల విషయంలో పార్లమెంట్ లో ప్రస్తావించాలని కూడ వైసీపీ భావిస్తోంది. పోలవరం తో పాటు ఇతర పద్దుల కింద రాష్ట్రానికి దక్కాల్సిన నిధుల విషయంలో పార్లమెంట్ వైసీపీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది.