వైసీపీ ఎంపీటీసీ శాంసన్ అదృశ్యం: పోలీసులకు ఫిర్యాదు
ప్రకాశం జిల్లా యనమదలలో వైసీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు శాంసన్ అదృశ్యమయ్యారు. వైసీపీకి చందిన రెండు వర్గాలు యద్దనపూడి ఎంపీపీ పదవి కోసం పోటీ పడుతున్నాయి.ఈ తరుణంలో శాంసన్ కన్పించకుండా పోవడం కలకలం రేపుతోంది.
ఒంగోలు:ప్రకాశం జిల్లా యనమదలలో వైసీపీ (ycp) ఎంపీటీసీ సభ్యుడు శాంసన్ (Samsan)అదృశ్యమయ్యారు.శాంసన్ కుటుంబసభ్యులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.యద్దనపూడి ఎంపీపీ పదవి కోసం వైసీపీలోని రెండు వర్గాల మధ్య పోటీ కొనసాగుతుంది. దీంతో శాంసన్ అదృశ్యం కావడం చర్చకు దారితీసింది. ఈ నెల 24వ తేదీన ఎంపీపీల ఎన్నికలు జరగనున్నాయి.ఈ మేరకు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
శాంసన్ భార్య యద్దనపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ వర్గాలు యద్దనపూడి ఎంపీపీ పదవి కోసం పోటీ పడుతున్న తరుణంలో ఏ వర్గమైనా శాంసన్ తమతో తీసుకెళ్లిందా లేదా శాంసనే కన్పించకుండా పోయాడా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.శాంసన్ సోమవారం నుండి కన్పించకుండా పోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. శాంసన్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ఏపీ రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. మెజారిటీ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. ప్రత్యర్ధులకు అందనంత దూరంలో ఆ పార్టీ అభ్యర్ధులు విజయాలను నమోదు చేశారు.