వైఎస్సార్ తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్ పథకం గతంలో వున్నదేనని అన్నారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.  జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరూ కోర్టుకు హాజరై కేసులు కొట్టేయించుకోవాలని సూచించారు. 

వైయస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకాన్ని శుక్రవారం ఏపీ సీఎం జగన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. డెలివరీ అయిన తర్వాత తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడమే ఈ కార్యక్రమం లక్ష్యం. అయితే ఈ పథకం గతంలో కూడా ఉండేదని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (raghu rama krishnam raju) దుయ్యబట్టారు. గతంలో ఉన్నదానికి పేరు మార్చి వైయస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారంటూ ఆయన ఎద్దేవా చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ గర్భానికి, గర్వానికి తేడా తెలియకుండా మాట్లాడారంటూ సెటైర్లు వేశారు. తూర్పుగోదావరి జిల్లా రామాలయంలో క్రైస్తవ ప్రచారం చేయడం దారుణమని రఘురామ వ్యాఖ్యానించారు. రూ. 300 కోట్లు ఖర్చు పెట్టి వాలంటీర్లకు సన్మానం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరూ కోర్టుకు హాజరై కేసులు కొట్టేయించుకోవాలంటూ రఘురామ హితవు పలికారు.

అంతకుముందు ఆసుపత్రుల వ్యవస్థల రూపురేఖల్ని మార్చి వేస్తున్నామని వైఎస్ జగన్ చెప్పారు. గర్భిణులు, బాలింతల కోసం YSR తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ఏపీ ప్రభుత్వం శుక్రవారం నుండి అందుబాటులోకి తీసుకు వచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇవాళ విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో 500 thalli bidda expressవాహనాలను సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం YS Jagan ప్రసంగించారు. తల్లీ బిడ్డకు ఈ వాహనాలు శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు.అక్కాచెల్లెళ్లకు ఈ వాహనాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలు అందించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని సీఎం చెప్పారు. దేవుడి దయతో ఇవాళ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు..

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మేరకు ఆసుపత్రుల్లో గర్భిణులు, బాలింతలకు మందులు అందిస్తున్నామన్నారు సీఎం జగన్. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లే సమయంలో సిజేరియన్ చేసుకొన్న మహిళకు రూ. 2500, సాధారణ ప్రసవం అయిన మహిళకు రూ. 5వేలు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయంలో వాహనాలు అందుబాటులో ఉండేవి కావన్నారు. 104, 108, తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.