నేరచరితులకు రాజకీయాలు బాగా పనికొస్తున్నాయి: వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
నేర చరిత్ర ఉన్నవారికి రాజకీయాలు బాగా పనికి వస్తున్నాయని మాజీ మంత్రి, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు.
కాకినాడ: నేర చరిత్ర ఉన్నవారికి రాజకీయాలు బాగా పనికి వస్తున్నాయని మాజీ మంత్రి, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు.
నాడు నేడు ముగింపు పాదయాత్రను పురస్కరించుకొని నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శిరోముండనం కేసు విచారణ త్వరగా పూర్తయ్యేలా చూడాలని రాష్ట్ర హోంశాఖ మంత్రికి లేఖ రాసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది.
అక్రమ సంపాదనకు రాజకీయాలను మార్గంగా ఎంచుకొంటున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయాలు వ్యాపార కేంద్రాలుగా మారడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.దళితుల శిరోముండనం కేసు 20 ఏళ్లుగా తేలకుండా ఉందని హోంమంత్రికి రాసిన లేఖలో పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
ఈ కేసు విచారణకు రాకుండా తోట త్రిమూర్తులు వాయిదా వేయించుకొంటున్నారని ఆయన ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ ల మధ్య రాజకీయ వైరం ఉంది.రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.