యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి గుడ్ బై చెప్పడంతో.. దుట్టా రామచంద్రరావుపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే దుట్టా రామచంద్రరావుతో వైసీపీ ఎంపీ బాలశౌరి శనివారం భేటీ అయ్యారు.
గన్నవరం వైసీపీలో కీలక పరిణామం చోటుచేసుకున్నాయి. యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి గుడ్ బై చెప్పడంతో.. దుట్టా రామచంద్రరావుపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే దుట్టా రామచంద్రరావుతో వైసీపీ ఎంపీ బాలశౌరి శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. గన్నవరంలో వల్లభనేని వంశీని దుట్టా రామచంద్రరావు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కూడా అదే అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఈ భేటీ అనంతరం బాలశౌరి మాట్లాడుతూ.. దుట్టా రామచంద్రరావు వైసీపీకి వీరవిధేయుడని చెప్పారు. గన్నవరంలో వైసీపీకి దుట్టా రామచంద్రరావు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. వైసీపీ పుట్టినప్పటీ నుంచి దుట్టా రామచంద్రరావు పార్టీలోనే ఉన్నారని చెప్పారు. గన్నవరంలో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ కోసం, వైసీపీ కోసం దుట్టా రామచంద్రరావు పనిచేస్తారని.. ఇందులో ఎలాంటి అనుమానం లేదని అన్నారు.
దుట్టా రామచంద్రరావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ విషయాలు మాట్లాడేందుకు మూడు నెలల క్రితమే సీఎం జగన్ తనను పిలిచారని చెప్పారు. ఆ సమయంలో తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా సీఎం జగన్కు చెప్పడం జరిగిందని అన్నారు. ఈరోజు కూడా బాలశౌరితో భేటీ అదే విషయాలు చెప్పానని తెలిపారు.
ఇక, గత అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరంలో టీడీపీ నుంచి విజయం సాధించిన వల్లభనేని వంశీ.. ఆ తర్వాత వైసీపీకి మద్దతుగా మారారు. వంశీని మొదట్నుంచీ గన్నవరం వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వ్యతిరేకిస్తూ వచ్చారు. వీరిద్దరు కూడా గతంలో వంశీపై వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడినవారే. ఈ క్రమంలోనే వీరిద్దరు వంశీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పనిచేశారు. అయితే కొంతకాలంగా వైసీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు.. టీడీపీ గూటికి చేరారు. అయితే దుట్టా రామచంద్రరావు మాత్రం వైసీపీలోనే ఉండిపోయారు.
గన్నవరం వైసీపీలో పరిణామాలపై సీఎం జగన్ దృష్టి సారించి దుట్టా రామచంద్రరావుతో భేటీ అయ్యారని.. ఈ క్రమంలోనే ఆయన పార్టీలో కొనసాగుతున్నారనే ప్రచారం కూడా వినిపిస్తోంది. అయితే దుట్టా రామచంద్రరావు వైసీపీలో ఉన్న తమకే సహకరిస్తాడన్న యార్లగడ్డ వెంకట్రావు వర్గం చెబుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు వైసీపీ ఎంపీ బాలశౌరి.. దుట్టా రామచంద్రరావుతో భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. వంశీతో కలిసి పనిచేయాలని అధిష్టానం మాటను దుట్టాకు చెప్పేందుకు బౌలశౌరి ఆయనను కలిసినట్టుగా ప్రచారం సాగుతుంది. దీంతో గన్నవరం వైసీపీలో పరిణామాలు ఉత్కంఠగా మారాయి.
