జగన్కు చేరిన బాలాపూర్ గణేశ్ లడ్డూ.. స్వయంగా అందజేసిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్
ఏపీ సీఎం వైఎస్ జగన్కు బాలాపూర్ గణేష్ లడ్డూ చేరింది. లడ్డూను వేలంలో దక్కించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఈరోజు జగన్ కు ఇచ్చారు. బాలాపూర్ లడ్డూను వేలంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో పాటు ఆయన వ్యాపార భాగస్వామి మర్రి శశాంక్ రెడ్డి 18.90 లక్షలకు పాడి దక్కించుకున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్లో వినాయక చవితి వేడుకలలో ఖైరతాబాద్ తర్వాత బాలాపూర్ పేరు తప్పకుండా వినిపిస్తుంది. గత కొన్నేళ్లుగా అక్కడి వినాయకుడి లడ్డూ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ధర సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డూను వైసీపీ నేత, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ సొంతం చేసుకోవడం విశేషం.
తన స్నేహితుడు, అబాకస్ విద్యాసంస్థల అధినేత మర్రి శశాంక్ రెడ్డితో కలిసి వేలంపాటలో పాల్గొన్న ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ రూ.18.90 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తాము వేలంలో దక్కించుకున్న లడ్డూను ఏపీ సీఎం జగన్ కు కానుకగా అందిస్తామని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం.. మంగళవారం ఆ భారీ లడ్డూను సీఎం జగన్ కు బహూకరించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన రమేశ్ యాదవ్ లడ్డూను జగన్కు అందజేశారు.
ALso Read:వైఎస్ జగన్ కు బాలాపూర్ లడ్డూ గిఫ్ట్: వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్
సీఎం జగన్కు ప్రఖ్యాతిచెందిన బాలాపూర్ లడ్డూను కానుకగా ఇవ్వడం కోసమే తాను వేలంపాటలో పాల్గొన్నానని రమేశ్ యాదవ్ వెల్లడించారు. తన పట్ల ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ చూపిన అభిమానం పట్ల సీఎం జగన్ ముగ్ధుడయ్యారు. ఈ సందర్భంగా రమేశ్ యాదవ్ కుటుంబ సభ్యులు కూడా సీఎం జగన్ ను కలిశారు.
మరోవైపు పరిషత్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపధ్యంలో ముఖ్యమంత్రి నివాసంలో సీఎం జగన్ను కలిసి అభినందనలు తెలిపారు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అలాగే కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) ఛైర్మన్ సుభాష్ కుమార్లు సైతం క్యాంపు కార్యాలయంలో జగన్ను కలిశారు. ఈ సందర్భంగా కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్పై సీఎం జగన్తో తరుణ్ కపూర్, ఓఎన్జీసీ ఛైర్మన్ సుభాష్ కుమార్లు చర్చలు జరిపారు.