టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం అయితే గుండు గీయించుకుంటానని సవాల్ విసిరారు వైసీపీ నేత, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. తనకు రూ.2 వేల కోట్లు వున్నాయని నిరూపిస్తే.. వాటిని రూ.20 కోట్లకే రాసిస్తానని తోపుదుర్తి సవాల్ విసిరారు. 

రాయలసీమలో సాగునీటి ప్రాజెక్ట్‌లపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై కౌంటరిచ్చారు వైసీపీ నేత, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్ట్‌ల పేరుతో చంద్రబాబు రూ.40 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సీమ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని.. ఆయన గజదొంగ అని, టీడీపీ అధినేత మరోసారి సీఎం అయితే తాను గుండు కొట్టించుకుంటానని తోపుదుర్తి సవాల్ విసిరారు. చంద్రబాబు ఏరోజైనా ప్రజా సంక్షేమం కోసం ఆలోచించారా అని ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే ఉద్దేశం ఆయనకు లేదని, శిలాఫలకాలు వేయడం తప్పితే ఆయన ఏం చేశారని తోపుదుర్తి నిలదీశారు. మీ దోపిడీల గురించి మాట్లాడితే బెదిరింపులకు దిగుతారా అని ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాజధాని అమరావతిని రియల్ ఎస్టేట్ దందాగా చంద్రబాబు మార్చారని ప్రకాష్ రెడ్డి విమర్శించారు. జగనన్న ఇళ్ల ద్వారా పేదల కల నెరవేరుతోందని.. చంద్రబాబులా తమ ప్రభుత్వానికి పేదలను దోచుకునే అలవాటు లేదని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు తన బినామీలతో అమరావతిలో భూములు కొనిపించారని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తనకు రూ.2 వేల కోట్లు వున్నాయని నిరూపిస్తే.. వాటిని రూ.20 కోట్లకే రాసిస్తానని తోపుదుర్తి సవాల్ విసిరారు. 

ALso Read: చంద్రబాబును ఎందుకు సీఎం చేయాలో చెప్పాలి: పవన్ పై పోసాని ఫైర్

అంతకుముందు చంద్రబాబుపై మండిపడ్డారు ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ పోసాని కృష్ణమురళి . జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబు వెనుక తిరుగుతున్నారో అర్ధం కాలేదన్నారు. పవన్ లాంటి రాజకీయ నేతలను ఇంతవరకు చూడలేదన్నారు. చంద్రబాబు సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని పవన్ కళ్యాణ్ గతంలో చేసిన విమర్శలను ఆయన ప్రస్తావించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ చంద్రబాబును గెలిపించాలని చూస్తున్నారన్నారు. 

కాపులను ఓడించిన చంద్రబాబును గెలిపించాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారన్నారు. మీ అన్నను ఓడించినా సరే చంద్రబాబును గెలిపించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు పోసాని కృష్ణమురళి. కాపులెంతో గొప్పవాళ్లో తాను సినిమాలు తీసినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఏపీలో ఏం జరుగుతుందో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఆలోచించుకోవాలన్నారు. ఇంతకన్న ఎక్కువ మాట్లాడితే తనను కూడ తిట్టిస్తారని పోసాని కృష్ణ మురళి చెప్పారు.