Asianet News TeluguAsianet News Telugu

విజయమ్మే మాకు పెద్ద దిక్కు .. అవినాశ్ కలిస్తే తప్పేంటీ, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర : శ్రీకాంత్ రెడ్డి

వైఎస్ విజయమ్మను వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కలవడంపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. విజయమ్మే మా అందరికీ పెద్ద దిక్కని, ఆమె దగ్గరికి వెళ్లి అవినాశ్ ఆశీర్వాదం తీసుకున్నాడని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. 

ysrcp mla srikanth reddy reacts ys avinash reddy meets ys vijayamma
Author
First Published Jan 28, 2023, 4:58 PM IST

విపక్షాలపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినాష్ రెడ్డి విజయమ్మను కలిసినా రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తోందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. హత్య ఎవరు చేశారు.. ఎందుకు చేశారో ఇప్పటికే తేలిపోయిందని ఆయన అన్నారు. అవినాష్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలని కుట్ర పన్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. అవినాశ్ రెడ్డి విచారణ పారదర్శకంగా జరగాలని.. ఆయనకు పార్టీ పూర్తిగా అండగా వుంటుందని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. విచారణను వీడియో రికార్డింగ్ చేయాలని.. ఆయన విచారణ ద్వారా ప్రజలకు నిజాలు తెలిసే అవకాశాలు వున్నాయని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మాదిరిగా జగన్ సీబీఐ రాష్ట్రంలోకి రావొద్దని అనలేదన్నారు. విజయమ్మే మా అందరికీ పెద్ద దిక్కని, ఆమె దగ్గరికి వెళ్లి అవినాశ్ ఆశీర్వాదం తీసుకున్నాడని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. 

ఇకపోతే.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి శనివారం సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. అయితే విచారణ జరుగుతున్న గదిలోకి అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులను అధికారులు అనుమతించలేదు. సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని విచారిస్తున్న నేపథ్యంలో.. సీబీఐ కార్యాలయం వద్దకు ఆయన అనుచరులు భారీగా చేరుకున్నారు. మరోవైపు కొందరు వైసీపీ నేతలు కూడా సీబీఐ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే వారిని విచారణ జరుగుతున్న చోటుకు అనుమతించకపోయినప్పటికీ.. వారు అక్కడే వేచిచూస్తున్నారు. ఇక, సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌ ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డిని విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా విచారణ కొనసాగే అవకాశం ఉంది. 

ALso Read: సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి.. న్యాయవాదిని అనుమతించని అధికారులు..

ఇక, విచారణకు హాజరయ్యే ముందు.. సీబీఐ అధికారులకు వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలకు సంబంధించి ఆయన సీబీఐ అధికారులను రిక్వెస్ట్ చేశారు. తాను సీబీఐ విచారణకు హాజరవుతున్నట్టుగా తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రారంభమైన దగ్గరనుంచి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపిన అవినాష్ రెడ్డి.. పనిగట్టుకుని ఓ వర్గం మీడియా లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోందన్నారు. తప్పుదోవపట్టించేలా వార్తలను ప్రసారంచేస్తున్నారని అన్నారు. విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నట్టుగా చెప్పారు. ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలని.. తనతో పాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలని, తన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios